హైదరాబాద్ : హుజూరాబాద్లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోర్టును కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వాన్ని పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
మొదట పథకాన్ని హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు పూర్తయ్యే వరకు దళితబంధు పథకం అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టును ఆశ్రయించారు.