అమిత్ షా, బండి, ధర్మపురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి
ఖైరతాబాద్, ఏప్రిల్ 5: ‘కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వంద రోజులన్నారు. ఆరేండ్లు గడిచాయి. కేంద్రమంత్రి అమిత్ షా, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వడం లేదు. వారు రిజర్వేషన్లకు అనుకూలమో, ప్రతికూలమో తెలుసుకోవాలంటే వారికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి’ అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆది నుంచి రిజర్వేషన్ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తున్నదని విమర్శించారు. దేశంలో అంబేద్కర్ వారసులపై జరుగుతున్న దాడులు, హత్యలను, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం’ అనే నినాదంతో ఈ నెల 14న నిజాం కాలేజీ వద్ద బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి ట్యాంక్బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నీలి కవాతు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో రాజ్యాంగ రక్షణ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ముత్యపాక నర్సింగరావు, డీబీవైఎఫ్ ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి కృష్ణ, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కోఆర్డినేటర్ కొమ్ము తిరుపతి, నాయకులు గడ్డ యాదన్న, మల్లికార్జున్, కల్పన తదితరులు పాల్గొన్నారు.