హుజూరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలన్న లక్ష్యంతో సాగుతున్న సీఎం కేసీఆర్ పాలనకు సబ్బండ వర్ణాల ప్రజలు జైకొడుతున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం గా అమలు చేస్తున్న వినూత్న పథకాలకు ఫిదా అవుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెలు, చేపల పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్కు అండగా నిలుస్తామని చెప్తున్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ఆయా వర్గాలు హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున స్వచ్ఛందగా ప్రచారం చేస్తున్నా రు. తమ ఓటు టీఆర్ఎస్కేనని తీర్మానాలు చేస్తున్నారు.
సామూహిక అభ్యున్నతి
వ్యక్తిగత సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ కింద హుజూరాబాద్ నియోజకవర్గంలోని 145 ఆవాసాల్లో 61,901 నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం సరఫరా అవుతున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 168 చెరువుల పునరుద్ధరణ చేసింది. చెరువులపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు ఉచిత చేప పిల్లల పంపిణీతో చేయూతనిచ్చింది. ఇప్పటివరకు ఆయా చెరువుల్లో 40 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. మహిళా సాధికారత కోసం నియోజకవర్గంలోని 1,273 మహిళా సంఘాలకు రూ.68.14 కోట్ల రుణాలను ఇచ్చింది. నియోజకవర్గంలో ఆరు రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటుచేసి, ఏటా 2,792 పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. పేదలకు ఉచిత విదేశీ విద్య కోసం ఒక్కో వ్యక్తికి రూ.20 లక్షల చొప్పున నియోజకవర్గంలోని 32 కుటుంబాలకు సాయం అందించింది. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో 1,66,204 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించింది. వీరిలో అవసరమైన 1,416 మందికి ఆపరేషన్లు చేయించింది. ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి పనిని అడగకుండానే చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రజలు స్పష్టంచేస్తున్నారు.
అభాగ్యులకు అండగా
తొమ్మిది క్యాటగిరీల్లో ఆసరా పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అభాగ్యులకు అండగా నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనంతగా దివ్యాంగులకు రూ.3016, ఇతర వర్గాలకు రూ.2016 చొప్పున సాయం అందిస్తున్నది. ఇలా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 37,737 మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు, నిరంతర ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీతో ఇప్పుడు పంటల సాగులో, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నియోజకవర్గంలో ఏడు వేల కుటుంబాలు లబ్ధి పొందాయి. తరాలుగా అణచివేతకు గురైన దళిత వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకాన్ని తెచ్చారు. దీని ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో జమ చేసింది. నియోజకవర్గంలో ఇప్పటికే 16,969 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. గొర్రెల పంపిణీ పథకంతో 9 వేల కుటుంబాలు లబ్ధి పొందాయి. చేనేత బీమా, సెలూన్లు-ధోబీఘాట్లకు ఉచిత కరెంటు, చేపల పంపిణీ పథకాలతో వేల కుటుంబాలకు సర్కారు అండగా నిలిచింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు పథకాల లబ్ధిదారులు ఇలా..
పథకం లబ్ధిదారులు
ఆసరా పెన్షన్లు 37,737
రైతుబంధు 63,409
పంటరుణ మాఫీ 4,538
రైతుబీమా 311
దళితబంధు 16,969
సాగుకు ఉచిత కరెంటు 33,859
కేసీఆర్ కిట్ 4,306
కల్యాణలక్ష్మి 6,626
షాదీముబారక్ 288
గొర్రెల పంపిణీ 9,387
చేనేత బీమా 600
కంటివెలుగు పరీక్షలు 1,66,204
కంటి వెలుగు ఆపరేషన్లు 1,416
రజకులకు ఉచిత కరెంటు 1,118
సెలూన్లకు ఉచిత కరెంటు 290
విదేశీ ఉచిత విద్య 32
దివ్యాంగులకు
వాహనాలు, పరికరాలు 810
ఇప్పుడు, ఎప్పుడూ కేసీఆర్కే జై
కోట్లాది మంది రైతుల ఉసురుపోసుకుంటున్న మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి బుద్ధి చెబుతాం. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చింది. నిలదీసే వారిపై దాడులకు పాల్పడుతుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని తీర్ల ఆదుకుంటున్నరు. ఈ 30న జరిగే ఎన్నికలే కాదు.. మళ్లచ్చే ఎన్నికలల్ల కూడా జై కొడుతం.
అన్ని తీర్ల ఆదుకున్నోళ్లకే ఓటేత్తం
మా ఆయనకు పానం మంచిగ లేదు. ఇంటికాడ్నే ఉంటడు. నేను కూలీ పనికి వోతున్న. ఒక్కోసారి పని దొర్కక పరేశాన్ అయితుండె. కేసీఆర్ సారు ఇస్తున్న రెండు వేల పింఛన్ ఆసరా అయితాంది. ఆయన మాకు సొంత అన్నలెక్క ఆదుకుంటున్నడు. కూలీ పని లేకున్నా.. బ్యాంకుల డబ్బులు పడుతయ్ అన్న ధైర్యం ఉన్నది. రేషన్ బియ్యం వస్తున్నయ్. రెండు వేలు ఇతర ఖర్చులకు సరిపోతున్నయ్. సుట్టాలు, పక్కోళ్లు కానకున్నా.. కేసీఆర్ సారు మాలాంటి పేదోళ్లకు అండగా ఉంటున్నడు. కేసీఆర్ సారును, కారు గుర్తును ఎప్పటికీ మరువ.