హైదరాబాద్ : మోకాళ్లపై యాత్రలు చేసినా.. మరో అడుగు ముందుకేసి ముక్కు నేలకు రాసే యాత్రలు చేపట్టినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించరి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నల్లగొండ జిల్లా రామన్నపేట మండల టీఆర్ఎస్ నూతన కమిటీ బాధ్యత స్వీకారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలు అన్ని టీఆర్ఎస్ సొంతానివేనన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా జయకేతనం ఎగురవేసినందునే 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మిలాంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 2014 ముందు.. తర్వాత వచ్చిన మార్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు.
ఆకలిచావులు, ఆత్మహత్యలు, రక్తపాతంతో అల్లాడిన తెలంగాణ.. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమంలో ఎలా పరుగులు పెడుతుందో యావత్ దేశం గమనిస్తున్నదన్నారు. యువత, తెలంగాణ సమాజం ఎప్పటికీ సీఎం కేసీఆర్ వెంటనే నడుస్తుందని, ఆయనపై ప్రజలు పెంచుకున్న విశ్వసనీయత అలాంటిదని కొనియాడారు. పాదయాత్రలు చేపట్టిన బీజేపీ నేతలు.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు సరఫరా చేయడం లేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పథకాలపై ఆయా పార్టీలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగులు లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.