అమరావతి : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. రెండు రోజుల కిందట ఏపీలో సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదంటూ ధ్వజమెత్తారు.
మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ, రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్ధానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని.. ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పుల ఊబిలోకి.. నెట్టిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలపై ఒక్కొక్క అంశాన్నీ వివరిస్తూ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామంటూ జగన్ ఇచ్చిన హామీకి భిన్నంగా పరిపాలన సాగుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునేందుకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కరెంట్ చార్జీలను తగ్గిస్తామని భరోసా ఇచ్చిన సర్కార్.. ఇప్పుడు ట్రూ అప్ ద్వారా అదనపు భారాన్ని మోపిందన్నారు. ప్రతి సంవత్సరం 6,500 పోలీసు ఉద్యోగాలను నోటిఫై చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. ఇప్పటిదాకా 450 ఖాళీలను మాత్రమే గుర్తించిందని.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను కూడా నోటిఫై చేస్తామని చెప్పి వాటిని 36కు పరిమితం చేసిందని, జాబ్ క్యాలెండర్, ఇసుక ధరలు, సంక్షేమ పథకాలు, నవరత్నాల అమలుపై విమర్శలు గుప్పించారు.