తిరుమల : అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాతంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.