హైదరాబాద్: పొగతాగే తండ్రులూ బహుపరాక్..! మీ దురలవాటే మీ పిల్లలపాలిట శాపంగా మారే ప్రమాదం ఉందట. ఇది మామూలుగా మాట కాదు. శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన నిజం. ధూమపానం చేసే తండ్రుల పిల్లలు క్యాన్సర్ మహమ్మారి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.తండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు, అందులోనూ ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని ఇటీవల బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
తండ్రుల ధూమపానం పిల్లల్లో క్యాన్సర్కు ఎలా కారణమవుతుందో కూడా పరిశోధకులు తెలిపారు. ధూమపానం చేసే వారి వీర్యంలోని డీఎన్ఏ దెబ్బతింటుందని, అలాంటి లోపభూయిష్టమైన డీఎన్ఏ కారణంగా వారికి పుట్టబోయే పిల్లల్లో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువని వారు వివరించారు. ఒకవేళ మీకు పొగతాగే అలవాటు ఉండి, మీ పిల్లలు క్యాన్సర్ బారిన పడకూడదు అనుకుంటే అందుకొక మార్గం చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు.
అదేంటంటే.. దంపతులు మూడు నెలలలోపు గర్భధారణ జరుగకుండా ప్లాన్ చేసుకుని, ఆ మూడు నెలలపాటు పురుషులు పొగతాగటం మానేయాలట. పొగతాగే అలవాటు ఉన్నా ఇలా మూడు నెలలపాటు మానేయడంవల్ల వీర్యంలోని డీఎన్ఏ తిరిగి మెరుగుపడుతుందట. అలాంటి సమయంలో గర్భధారణ జరిగితే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట. ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ డయానా యాండర్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అదేవిధంగా, వీర్యంలోని డీఎన్ఏ మూడు నెలల్లో ఎలా మెరుగుపడుతుందనే విషయాన్నికూడా డయానా వివరించారు. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందడానికి మూడు నెలల సమయం పడుతుందట. అందువల్ల కనీసం మూడు నెలలపాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే వీర్యంలో దెబ్బతిన్న కణాల ఆరోగ్యకణాల స్థానంలో ఆరోగ్యకరమైన కణాలు వస్తాయట. దాంతో పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారు డయానా.