వరితో లాభమెక్కడిది. ఎకరానికి 50 వేలు రాబడి వస్తే అందులో పెట్టుబడి 30 వేలు పోతది. ఇగ మిగిలేది 20 వేలు. అందుకే ఆ పంటను పక్కనబెట్టి బొప్పాయి పంట సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నానని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాంధారిపల్లికి చెందిన రైతు దయానంద్రెడ్డి తెలిపారు. బొప్పాయి పంటతో ఉన్న లాభాలు, సాగు చేయాల్సిన పద్ధతిని వివరించారు.
మెదక్, డిసెంబర్ 6: రైతులంతా ఇతర పంటలవైపు చూడాల్సిన సమయం వచ్చిందని, కూరగాయలు, పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతు దయానంద్రెడ్డి చెప్తున్నారు. తాను ఎకరం పది గుంటల్లో బొప్పాయి సాగుకు రూ.80 వేలు పెట్టుబడి పెడితే, రూ.3.20 లక్షల ఆదాయం వచ్చిందని వివరిస్తున్నారు. ఏడాదికాలంగా బొప్పాయి పంట పండిస్తున్నానని, మినుము, మునగ, టమాట పంటలను కూడా సాగుచేస్తున్నట్టు తెలిపాడు. కొంచెం స్పృహతో ఆలోచించి, దిగుబడిని ఇచ్చే పంటను వేస్తే లాభాలు సాధించవచ్చని వెల్లడించారు.
ఒక్కో చెట్టుకు 110 కాయలు
బొప్పాయి సాగుకు మెట్ట నేలలు అనుకూలం. ప్రతి ఆరు అడుగులకు ఒక అడుగు లోతు గుంత తవ్వి, ఎరువు వేసి వారం, పది రోజుల పాటు మగ్గనివ్వాలి. అందులో మొక్కలను నాటాలి. సేంద్రియ పద్ధతిలో పండించాలంటే.. తోటలో పైమట్టికి 5 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో వేప పిండి, 20 గ్రాముల అజోస్పెరిల్లం, 20 గ్రాముల పాస్పేబుక్తెరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. విత్తు నాటిన మూడు రోజులకు నీరు పోయాలి. తర్వాత రోజుకోసారి మొక్కలను నీటితో తడిపితే సరిపోతుంది. పిందె దశలో ఉన్నప్పుడు రోజు తప్పించి రోజు నీరు పోస్తే ఆరు నెలల్లో బొప్పాయి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక బొప్పాయి చెట్టుకు 40 నుంచి 50 కాయల వరకే వస్తాయి. కానీ తైహాన్రెడ్ లేడి(786) రకం బొప్పాయిలో 110 కాయలు కాస్తున్నాయి. మొక్కలు నాటిన 4-5 నెలల్లో పూత ప్రారంభమవుతుంది. పూత వచ్చిన 4 నెలలకు కాయ తయారవుతుంది. పసుపు రంగు చారలు రాగానే కాయలను కోయాలి. పంట వేసిన 9వ నెల నుంచి రెండేండ్ల వరకు కాయలను కోయొచ్చు.
తైహాన్ రెడ్ లేడి (786) రకం
ఈ రకం పండ్లు ఆకర్షణీయంగా, పెద్దగా, నారింజ రంగు గుజ్జుతో, తియ్యగా ఉంటాయి. ఈ రకం దూరప్రాంతాల రవాణాకు, నిల్వకు అనుకూలం. హషిమ్గెటాన్, సోలో, కో-1, కో-2, పూసా డెలీషియస్, పూసా మోజాస్తి రకాలు సాగులో ఉన్నవి. బొప్పాయిని విత్తనం ద్వారా నాటాలి. ఎకరానికి 20 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. 10 గ్రాముల ప్యాకెట్లలో విత్తనం దొరుకుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ విలువ రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఉంటుంది.
పెట్టుబడి పోగా 3.20 లక్షలు వచ్చాయి
సంవత్సరం కింద బొప్పాయి పంట వేశా. ఎరువులు, విత్తనాలు, లేబర్, ట్రాక్టర్, పురుగుల మందుతో కలిపి రూ.80వేలు ఖర్చు అయ్యింది. మొన్నే ఎకరం 10 గుంటల తోటను రూ.4 లక్షలకు అమ్మాను. పెట్టుబడి పోగా రూ.3.20 లక్షలు వచ్చాయి. మరో రెండెకరాల్లో ఈ నెల చివర్లో బొప్పాయి పెడతా. కరోనాతో పంటకు ధర కూడా వచ్చింది.