న్యూఢిల్లీ, జనవరి 17: దిగ్గజ కథక్ కళాకారుడు బిర్జు మహరాజ్ కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో ఆయన చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరణానికి గుండె పోటు కారణం కావచ్చని పేర్కొన్నారు. భోజనం తర్వాత కుటుంబ సభ్యులందరూ అంత్యాక్షరి ఆడుతున్నామని, ఆ సమయంలో బిర్జు మహరాజ్ అకస్మాత్తుగా కింద పడిపోయారని తెలిపారు. బిర్జు మహరాజ్ వయస్సు 83 ఏండ్లు. అందరూ ఆయనను మహరాజ్ జీ అని పిలిచేవారు. 1986లో ఆయన పద్మ విభూషణ్ పురస్కారం అందుకొన్నారు. బిర్జు మహరాజ్ మృతి ప్రపంచానికి తీరని లోటు అని ప్రధాని మోదీ అన్నారు.