దేవాలయాల్లో జరిగే ప్రత్యేక అభిషేకాల్లోనే కాదు, ఇళ్లలో చేసుకునే ప్రతి శుభకార్యంలోనూ పంచామృతాన్ని ఉపయోగిస్తాం. ఆవుపాలు, ఆవుపాలు తోడుపెట్టి తయారు చేసిన పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర కలిపి తయారు చేసే పంచామృతం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ప్రశస్తమైనది. తొందరగా జీర్ణమయ్యే ఆవుపాలు ఎముకల పటుత్వానికి దోహదం చేస్తాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు పిల్లలకూ, పెద్దలకూ మేలు చేస్తాయి. ఆవు పెరుగు జీర్ణ సంబంధమైన వ్యాధులను నియంత్రించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. మేధాశక్తిని పెంపొందించడంలో ఆవు నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది.
ఆవు నెయ్యి వాడకం వల్ల చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. శరీరానికి తక్షణమే శక్తినిచ్చే గొప్ప ఔషధం తేనె. స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ పాడవదు. ఇది రోగనిరోధక శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. చక్కెర కూడా శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అయితే దీనిని పరిమితంగా వాడాలి. అధికంగా ఉపయోగిస్తే హానికరం. రుచిలో, ఔషధ గుణాల్లో, ఆరోగ్య పరిరక్షణలో ఈ ఐదు పదార్థాలు సహజంగానే అమృత తుల్యమైనవి. ఈ కారణంగానే మన పెద్దలు వీటి సమ్మేళనానికి పంచామృతం అని పేరు పెట్టారు. పూజాదికాల్లో ఉపయోగించడం ద్వారా పవిత్రతను కల్పించారు.