హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని మండలాలలో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు తెలంగాణలో రూ.116 కోట్ల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.
ఇందులో 19,413 పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నిర్మాణంలో ఉన్న వాటిని సైతం పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పల్లె ప్రకృతి వనాలకు గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. మండల కేంద్రాల్లో భూమి లభించినట్లయితే.. మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీలో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఒక్కొక్క పల్లె ప్రకృతి వనం ఏర్పాటు రూ.40లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వనానికి దాదాపు 31,000 మొక్కలను పెంచుతామని మంత్రి తెలిపారు. దీని కోసం ఇప్పటి వరకు 535 మండలాల్లో పది ఎకరాల చొప్పున 5,300 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. మిగతా పది మండలాల్లో భూమి ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తవుతుందని ఆయన తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.