గద్వాల: పాలమూరు మోడల్ విలేజ్పై కాన్సెప్ట్ నోట్ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆవిష్కరించారు. మోడల్ విలేజ్ భావనను ఉన్నత్ భారత్అభియాన్ (యూబీఏ) కింద పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ రూపొందించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న ఉన్నత భారత్ అభియాన్లో గ్రామ సాధికారత కార్యక్రమం ప్రతిష్ఠాత్మకమైనది. దీనికి ఐఐటీ ఢిల్లీ జాతీయ సమన్వయ సంస్థగా ఉంటోంది.
గ్రామోదయ ఛాంబర్ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ. భారతీయ గ్రామాలు స్వయంసమృద్ధి సాధించేలా విధివిధానాలు రూపొందించి, అమలుచేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ వసంత్, సీఈవో శ్రవణ్ మడప్, సీఓఓ కామేశ్వర్ రాజు, సభ్యులు చతుర్వేది కలిసి ఈ భావన గురించి మంత్రుల బృందానికి వివరించారు.
గ్రామీణ సాధికారత కోసం ఉన్నత విద్యా సంస్థలను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం యూబీఏ ప్రాథమిక లక్ష్యం. ప్రాథమిక సర్వేలో ఉన్న లోపాలను తెలుసుకున్న తర్వాత, గ్రామం యొక్క సామాజిక, సాంస్కృతిక ప్రొఫైల్ను రూపొందించేందుకు నాణ్యమైన, పరిణామాత్మక సమాచారంపై దృష్టిపెట్టేలా విలేజ్ మోనోగ్రాఫ్ అనే విభిన్నమైన మోడల్తో జీకాట్ ముందుకొచ్చింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పవన్కుమార్, ఓఎస్డీ మధు, ప్రొఫెసర్ నాగం కుమారస్వామి డాక్టర్ రాజశేఖర్, ప్రొఫెసర్ మనోజ, మోడల్ విలేజ్ భావనలోని వివిధ అంశాలను వివరించారు.
బాలానగర్ మండలంలోని ఉడిత్యాల, నవాబ్పేట మండలంలోని దేపల్లె, జడ్చర్ల మండలంలోని వల్లూరు గ్రామాలను పాలమూరు వర్సిటీ దత్తత తీసుకుంది. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఆ గ్రామాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఏమైనా లోపాలుంటే పరిశీలించి, వాటి పరిష్కారానికి జీకాట్ మార్గాలను చూపిస్తుంది. తమను పెంచి పోషించిన సమాజానికి తిరిగివ్వాలనే దాతృత్వ భావనతో, గ్రామాల్లో కార్యకలాపాలకు విరాళాలు అందించే నాన్ రెసిడెంట్ విలేజర్స్ (ఎన్ఆర్వీలు) ఎవరున్నారో కూడా జీకాట్ గుర్తిస్తుంది.
నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత సాధికారత, ఎస్హెచ్జీలు, ఎఫ్పీఓలలో సామర్థ్య నిర్మాణం ద్వారా మహిళా సాధికారత, సహకార సంస్థల పనితీరును అర్థం చేసుకోవడం, రైతుల కోసం అత్యుత్తమ సాగు పద్ధతులను పరిచయం చేయడం, మార్కెట్ లింకేజీ, పశువుల హాస్టళ్ల నిర్వహణ, ప్రత్యామ్నాయ వైద్యవిధానాల గుర్తింపు, స్థానిక జానపద, లలిత కళల ఆవశ్యకత.. సామాజిక, మానసిక సామరస్యతను పెంపొందించి, ఇతర రంగాలను గుర్తించడం లాంటివి ఇందులో ఉంటాయి. స్థానిక తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం ఉన్నత్ భారత్ అభియాన్ విధానాలతో ఒక మార్గాన్ని రూపొందించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి జీకాట్ (GCOT)తో త్వరలో ఒక ఒప్పందం చేసుకోనుంది.