పద్మజా రెడ్డి జీవితమే ఓ నాట్యశాస్త్ర గ్రంథం. బాల్యంలో ‘దారి విడువుము కృష్ణా’ అంటూ రాధికలా నర్తించి కృష్ణతత్వాన్ని చాటారు. ఇటీవల, ‘కాకతీయం’ అనే నృత్య రూపకానికి ప్రాణంపోసి.. రుద్రమగా రౌద్రాన్ని ఒలికించారు. ‘పద్మశ్రీ’ పద్మజ నాట్య జీవితం శతదళ శోభిత సువర్ణ కమలం!
రెండేండ్లకే శిక్షణ. ఏడేండ్లకే మొదటి ప్రదర్శన. యాభై ఏండ్లలో దేశ విదేశాల్లో మూడువేలకు పైగా ప్రదర్శనలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ జి. పద్మజారెడ్డి భావి కళాకారులకు ఓ స్ఫూర్తి కేంద్రం. ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి అతి సమీపంలో ఉన్న పామర్రు ఆమె జన్మస్థలం. తండ్రి జీవీ రెడ్డి వృత్తిరీత్యా వైద్యులు. తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి.
ఊహ తెలిసినప్పటి నుంచీ నృత్యమే ప్రాణం. ఏడేండ్ల వయసులో పామర్రులోని శ్రీకృష్ణ ఆలయంలో ‘దారి విడువుము కృష్ణా’ అంటూ ఆమె నృత్యాభినయం చేస్తుంటే.. ప్రేక్షకులలో ఆధ్యాత్మిక పరవశం. ‘నా నాట్య గురువు దివంగత శోభానాయుడు నాలో స్ఫూర్తిని నింపారు’ అంటూ పాఠం నేర్పిన గురువుకు ప్రణతులర్పిస్తారు. అదే సమయంలో కుటుంబ ప్రోత్సాహాన్నీ గుర్తుచేసుకుంటారు. ‘నేను మూడు వేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చానంటే, ఆ ప్రయాణంలో కుటుంబ ప్రోత్సాహం వెలకట్టలేనిది. భర్త శ్రీనివాస్ రెడ్డి, కుమారుడు ప్రణవ్, కోడలు మౌనాల సహకారం మాటల్లో చెప్పలేనిది’ అంటారామె. పద్మజ దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. వందలాది శిష్యులను నాట్య సరస్వతికి కానుకగా సమర్పిం చారు. భారతీయ నృత్య కళారీతిని ఖండాంతరాలకు విస్తరించారు. ఆ అంకితభావమే ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. తన విద్యార్థులంతా తనకు వారసులేనంటారు పద్మజ.
అలనాటి వైభోగం
కాకతీయ సామ్రాజ్యానికి విశేష చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో నాటి ఓరుగల్లు….నేటి వరంగల్ పాత్ర అజరామరం. కళలకు, సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు కాకతీయ ప్రభువులు. “రాణి రుద్రమకు దగ్గరి బంధువు అయిన జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’ నాలో స్ఫూర్తిని నింపింది. ఆ గ్రంథానికి నృత్య రూపం ఇవ్వాలన్న తపనలోంచి పురుడు పోసుకున్నదే ‘కాకతీయం’. ఈ రూపకం నా చిరకాల స్వప్నం. నాకు పద్మశ్రీ పురస్కారం రావడంలోనూ కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నా. జాయపసేనాని కూడా సిద్ధేంద్రయోగి అంతటి మహానుభావుడే. ‘కాకతీయం’ నా హృదయావిష్కరణ. దీనికో రూపం ఇవ్వడానికి ఓ దశాబ్దకాలం శ్రమించాను. ఎందరో చరిత్రకారులను సంప్రదించాను. ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేశాను” అని చెబుతారు ఆ నిత్య విద్యార్థి.
రేపటి తరాల కోసం
“కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో హైదరాబాద్లో ప్రణవ్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీని స్థాపించాను. రాతిని శిల్పంగా చెక్కినట్టు, ప్రతి విద్యార్థినీ తీర్చిదిద్దుతున్నా. కూచిపూడి నృత్యం అనేది సునాయాసం కాదు.. నేటితరం జుంబా, వెస్ట్రన్ డ్యాన్స్లు గంటల వ్యవధిలో నేర్చుకుంటున్నారు.
కూచిపూడిలో ప్రతిభ సాధించాలంటే …శ్రమ, తపన కావాలి. నృత్య కారులుగా రాణించాలంటే ఆరేండ్ల సమయమైనా పడుతుంది. తల్లిదండ్రులు సంప్రదాయాలపై యువతకు అవగాహన కల్పించాలి. అప్పుడే కూచిపూడికి పూర్వ వైభవం వస్తుంది. పద్మశ్రీ పురస్కారంతో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా” అంటూ కళా వైశిష్ట్యాన్ని, కన్నవారి బాధ్యతనూ వివరిస్తారు పద్మశ్రీ పద్మజా రెడ్డి.