ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) – 2021కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడగించినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వెబ్సైట్ నిర్వహణ కారణంగా రెండు రోజుల పాటు వెబ్సైట్ పనిచేయలేదని గుర్తు చేశారు.
గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చివరితేదీ బుధవారంతో పూర్తయిందని, కానీ ప్రస్తుతం ఈ గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో వచ్చే నెల 12వ వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు మొత్తం సుమారు అరవై వేల దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు.