హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల నెల రోజుల కృషితో 2,785 మంది చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూశాయి. బాలకార్మికులు, వెట్టిచాకిరీ చేస్తున్నవారు, అదృశ్యమైనవారు ఇలా పలు రకాల చిన్నారులను గుర్తించేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం, మహిళా శిశు సంక్షేమశాఖ, కార్మికశాఖ, ఆరోగ్యశాఖ, చైల్డ్వెల్ఫేర్ కమిటీలుసహా అన్ని ప్రభుత్వశాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటైన బృందాలు జనవరి ఒకటి నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-8 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. క్షేత్రస్థాయి తనిఖీలతోపాటు పోలీస్శాఖ దర్పన్యాప్ ద్వారా చిన్నారుల జాడను కనిపెట్టారు. చిన్నారులతో పనిచేయిస్తున్న 360 మందిని గుర్తించి వారిపై 342 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు మహిళా భద్రత విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా తెలిపారు.