యాదాద్రి, ఫిబ్రవరి 28: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులు ఇకముందు ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకుని రావాల్సిందే. గతంలో మాదిరి ఆలయానికి వచ్చి టికెట్ తీసుకునే పద్ధతికి అధికారులు స్వస్తి పలుకనున్నారు. మార్చి 28న యాదాద్రీశుడి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ తరహాలోనే ఇక్కడా ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను తీసుకురావాలని యోచిస్తున్నారు. యాదగిరిగుట్ట.కామ్ వెబ్సైట్ ద్వారా భక్తు లు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. ఆన్లైన్ టికెట్ తీసుకునే భక్తులకు క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. కొండపైన గల స్వాగత తోరణం నుంచి క్యూఆర్ కోడ్ ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోజుకు ఎంత మందికి ఆన్లైన్లో టికెట్లు ఇవ్వాలి, ఎంత రుసుం వసూలు చేయా లి తదితర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉచిత దర్శనాలకు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పాదయాత్రగా వచ్చే భక్తులకు వైకుంఠ ద్వారం వద్ద టికెట్ల కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కొండ కింద గల కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, సత్యనారాయణ వ్రత మండపం, ఆర్టీసీ బస్ టెర్మినల్ ప్రాంతాల్లో ఆన్లైన్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్, భక్తులను దర్శనాలకు అనుమతినిచ్చే తీరు, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 4న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
తిరుమల తరహాలో యాదాద్రిలోనూ వీవీఐపీ, వీఐపీ, సిఫార్సు లేఖలు, డోనర్ల కోసం ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలకు సన్నాహాలు చేస్తున్నారు. యాదాద్రిలో ప్రధానంగా శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ ఉన్న రోజులు మినహాయించి మిగతా రోజుల్లో బ్రేక్ దర్శనాలను ఇవ్వాలని యోచిస్తున్నారు. తిరుమలలో బ్రేక్దర్శనం ఉదయం 6.30 గంటలకు ఉన్న నేపథ్యంలో యాదాద్రిలో ఉదయం 9.30 గంటల సమయంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆన్లైన్ టికెట్తో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రణాళికలు
రూపొందిస్తున్నారు.
యాదాద్రి, ఫిబ్రవరి 28 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. సోమవారం స్వామివారికి రూ.11.51 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం సమకూరింది. హైదరాబాద్కు చెందిన వీపీఆర్ కన్స్ట్రక్షన్స్ రూ.10 లక్షలు, హైదరాబాద్కు చెందిన హరికిషన్రావు-శ్రీలత దంపతులు రూ.30 గ్రాముల బంగారం, కర్మన్ఘాట్కు చెందిన ప్రసాద్-సునీత దంపతులు రూ.51వేలు,, పాతగుట్ట స్థానార్చకుడు మరింగంటి యాదగిరిస్వామి సంస్మరణార్థం ఆయన కుమారుడు మరింగంటి కృష్ణమాచార్యులు లక్ష రూపాయల చెక్కును యాదాద్రిలో ఆలయ ఈఓ
ఎన్.గీతకు అందజేశారు.