న్యూఢిల్లీ, జనవరి 30: ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, పాస్పోర్టు.. ఇలాంటి రకరకాల గుర్తింపు పత్రాలను అన్నింటినీ అనుసంధానం చేసేలా ఒక కొత్త డిజిటల్ యూనిక్ ఐడీ కార్డును తీసుకురావాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. త్వరలోనే ఆ వివరాలను ప్రజల ముందుకు తీసుకురానున్నది. వచ్చే నెల 27లోగా దీనిపై ప్రజల అభిప్రాయాలను కోరనున్న ప్రభుత్వం.. వచ్చిన విలువైన సూచనలను పరిగణలోకి తీసుకొని ముసాయిదాలో మార్పులు చేయనున్నట్టు సమాచారం.
అన్నింటికీ ఒకటే
ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు సేవలు, ఇతర సందర్భాల్లో ఆధార్, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలా వేర్వేరు గుర్తింపు పత్రాల అవసరం ఉంటుంది. అయితే వీటి అన్నింటి స్థానంలో కొత్తగా తీసుకువచ్చే యూనిక్ డిజిటల్ ఐడీని వినియోగించవచ్చు. ఈ ఐడీ సాయంతో అన్ని గుర్తింపు కార్డులను ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. వేర్వేరు గుర్తింపు కార్డులు ఒకే దగ్గర ఉండటం వల్ల ఏది అవసరమైతే దాన్ని పరిగణలోకి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. అన్ని కార్డులను ప్రతీచోటుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. థర్డ్ పార్టీ సర్వీసులు, ఈకేవైసీ కోసం కూడా ఈ డిజిటల్ ఐడీని ఉపయోగించవచ్చని కేంద్రం ముసాయిదాలో పేర్కొన్నది. ఆధార్ కార్డుకు నంబర్ లాగే ఈ ఐడీ కార్డుకు కూడా నంబర్ కేటాయిస్తారని తెలుస్తున్నది. ఇండియా ఎంటర్ప్రైస్ ఆర్కిటెక్చర్ 2.0 క్యాంపెయిన్లో భాగంగా కేంద్రం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది.
హ్యాకింగ్ బెడద మాటేంటి?
ఆధార్, పాన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పౌరుల కీలక డేటాను నిక్షిప్తం చేసిన యూనిక్ డిజిటల్ కార్డు హ్యాకింగ్కు గురైతే పరిస్థితి ఏమిటని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శక్తిమంతమైన సైబర్ దాడులను తట్టుకొని ఈ కార్డు డేటా సురక్షితంగా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. యూనిక్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చే కంటే ముందు సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమున్నదని నొక్కి చెబుతున్నారు.