శ్రీనగర్: అమర్నాథ్ గుహ వద్ద అకస్మాత్తుగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదలో గుహ వద్ద ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, మరో 40 మంది గల్లంతు అయ్యారు. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా ఇవాళ ప్రశ్నలు సంధించారు. అమర్నాథ్ గహ వద్ద ఏం జరిగింది, ఎలా జరిగిందో ప్రభుత్వం వివరిస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రిస్కీ ప్లేస్లో ఎలా టెంట్లను అమర్చారో ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో గుడారాలను వేయడం ఇదే తొలిసారి అని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. బహుశా ఇది మానవ తప్పిదమే అయి ఉంటుందని ఆయన అన్నారు. అమర్నాథ్ ఘటన దురదృష్టకరమన్నారు. వరదలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.