న్యూఢిల్లీ, జనవరి 25: తాజాగా తలెత్తిన కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేవ్ కారణంగా భారత్ ఆర్థికాభివృద్ధి తగ్గుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. మూడో కొవిడ్ వేవ్తో ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలు కలుగుతాయని, 2022 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్ని 9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఐఎంఎఫ్ మంగళవారం ప్రకటించింది. సంస్థ గత అంచనాల్లో ఇది 9.5 శాతంగా ఉంది. సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్లో సైతం గణనీయంగా కోత విధించింది. గతేడాది అక్టోబర్లో విడుదలైన నివేదికలో ప్రపంచ వృద్ధి రేటు అంచనా 4.9 శాతంకాగా, ఇప్పుడు దానిని 4.4 శాతానికి కట్ చేసింది.
2024 అంచనాలు పెంపు
ఇండియా జీడీపీ వృద్ధి అంచనాల్ని 2024 ఆర్థిక సంవత్సరానికి మాత్రం 6.6 శాతం నుంచి 7.1 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరపతి వృద్ధి పుంజుకుంటుందని, తద్వారా దేశంలో పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయని, ఆర్థిక సేవల రంగం రాణిస్తుందని సంస్థ నివేదికలో వివరించింది. గత అక్టోబర్ నివేదికలో కొవిడ్ రెండో వేవ్ పరిణామాల్ని పరిగణనలోకి తీసుకున్నామని, తాజా నివేదికలో మూడో వేవ్ ప్రభావాన్ని పరిగణించి అంచనాల్ని విడుదల చేస్తున్నట్లు ఐఎంఎఫ్ తెలిపింది. పలు దేశాల్లో నియంత్రణల్ని అమలు చేయడం వృద్ధిని ప్రభావితం చేస్తుందని, ఇంధన ధరలు పెరగడం, సరఫరా ఆటంకాలు ఏర్పడటంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఇది అమెరికాలోనూ, పలు వర్థమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ జరుగుతుందని సంస్థ వివరించింది.