హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ధరణిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమై వచ్చిన సమస్యలపై చర్చించింది. వివిధ రైతుసంఘాలు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా), క్రెడాయ్ తదితర వర్గాల ప్రతినిధులు ఇప్పటికే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వీటిని అధికారులు విశ్లేషించగా ప్రధానంగా సర్వే నంబర్లు కనిపించకపోవడం, విస్తీర్ణం, పేర్లు తప్పుగా నమోదవడం, పాస్బుక్ మంజూరు కాకపోవడం, సాగుభూమి వ్యవసాయేతర భూమిగా కనిపించడం, ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి తప్పుగా నమోదవడంపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
మొత్తం 34 రకాల సమస్యలను అధికారులు సబ్కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు 22 రకాల సమస్యలకు ధరణిలో మాడ్యూల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఒక క్యాటగిరీకి ధరణితో సం బంధం లేదని, మిగతా 11 ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని గుర్తించినట్టు సమాచారం. వచ్చేవారం కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నదని సమాచారం. తెలిసింది.
1) పేరులో మార్పులు, చేర్పులు. 2) విస్తీర్ణంలో మార్పులు. 3) సర్వే నంబర్ తొలిగింపు. 4) ఎన్వోసీ/ఓఆర్సీ/38-ఈ/13-బీ 5) సర్వే నంబర్ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం. 6) అసైన్డ్ భూములను పట్టా భూములగా మార్పు. 7) ల్యాండ్ నేచర్/ల్యాండ్ టైప్ను మార్చడం. 8) మిస్సింగ్ సర్వేనంబర్/కొత్త ఖాతా సృష్టించడం. 9) ఖాతాల విలీనం/ఖాతాను విభజించడం. 10) లావాదేవీని నిలిపివేయడం/ఉపసంహరించడం. 11) జాయింట్ పట్టా.