హైదరాబాద్ : మార్చి 4. వరల్డ్ ఒబేసిటీ డే(ప్రపంచ ఊబకాయ దినోత్సవం). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్లో జరిగిన అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఊబకాయం అనేక రుగ్మతలకు మూల కారణం అన్నారు. టెక్నాలజీ ఒకవైపు శ్రమను తగ్గిస్తూ మనిషికి సుఖశాంతులను తీసుకురాగా మరోవైపు అనేక జబ్బులు కూడా మోసుకొచ్చిందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ చేయాలనే భావన లేకుండా పోయిందన్నారు. కరోనా సమయంలో ఎక్కువమంది కరోనా భారినపడిన వారు, చనిపోయిన వారు సైతం స్థూలకాయం ఉన్న వారేనన్నారు.
రోజూవారీ పనితో పాటు, వ్యాయామం చేయడం మంచిదనే అవగాహన ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన యువ శక్తి లేకపోతే దేశాభివృద్ధి కుంటుబడుతుందన్నారు. పాత రోజుల్లో డబ్బులు లేనివారు గటక తినేవారు. ఉన్నవారు వరి అన్నం తినేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఉన్నవాళ్లు అన్నం మానేసి గటక తినే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్టు. మన పాత వంటకాలు, సంప్రదాయాలు, ఆచారాలు కాపాడుకోవాలన్నారు. కరోనా సమయంలో మన వంటింట్లో ఉండే పోపుల పెట్టే మనల్ని కాపాడిందన్నారు. సహజ సిద్ధమైన వ్యవస్థను పాడవకుండా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్ మొదటిది కాదు, చివరిది కాదు. ఏ నాటికైనా ప్రకృతే గొప్పదని మంత్రి అన్నారు.