ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతున్నది. నదిలో నీటిమట్టం గంట గంటకూ పెరుతున్నది. శనివారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి సీఎం శనివారం ఫోన్ చేశారు. హుజూరాబాద్ పరిధిలోని ఎస్సీలందరూ ఈ నెల 26న ప్రగతిభవన్కు రావాల్సిందిగా సీఎం ఆహ్వానించారు.
ఒలింపిక్స్లో తొలి రోజే ఇండియా పతకాల బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ గెలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్లిఫ్టింగ్లో మెడల్ గెలిచిన తొలి అథ్లెట్గా మీరాబాయ్ నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్లో మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి బ్రాంజ్ మెడల్ గెలవగా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వర్తో మెరిసింది. ఈ సందర్భంగా చానూకి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్లలో వేడుకలు జరిపారు. లండన్లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే, బహ్రెయిన్లో అక్కడి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. TRS ఖతర్ ఆధ్వర్యంలో దోహాలోనూ కేటీఆర్ బర్త్ డే వేడుకలు జరిపారు.
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసి జాతీయ రికార్డును సృష్టించారు. ఈ శిబిరంలో మొత్తం 2,425 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సినీ కార్మికులు రక్తదానం చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిరుపేద వృద్ధ దంపతులకు ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇంటిని నిర్మించి ఇచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన వృద్ధ దంపతులు రాగం మల్లయ్య, పోసక్కల చేత గృహ ప్రవేశం చేయించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందని పురాణం సతీష్ అన్నారు.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేశారు. వయాన్ ఇండస్ట్రీస్లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత శిల్పా శెట్టికి సమన్లు పంపుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్కు శిల్పా శెట్టి రాజీనామా చేసినట్లు సమాచారం వెలువడుతున్నది.
భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది మృతిచెందారు.
ఒలింపిక్ క్రీడల్లో 25 ఏండ్ల తర్వాత భారత్ సంచలనం సృష్టించింది. పురుషుల టెన్నిస్ సింగిల్స్లో భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ తొలి రౌండ్ గెలిచాడు. అంతకుముందు భారత్ తరఫున 1988లో జీషన్ అలీ, 1996 లో లియాండర్ పేస్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఇక పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన హాకీ మ్యాచ్లో భారత్ 3-2తో విజయం సాధించింది. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్కు అర్హత సాధించాడు.