Meals in Flight | బస్సులో దూర ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఆకలేస్తే తినేందుకు ఏదో ఒక ఫలహారం తీసుకెళ్తాం. కొన్నేండ్ల క్రితం వరకూ సద్ది ఓ ఆనవాయితీ. ఇప్పుడైతే ఆ మోత అవసరం లేదు. హైవే మీద మంచి రెస్టారెంట్ చూపించి.. ‘ఇక్కడ బస్ పది నిమిషాలు ఆగుతది.. ఏమైనా తినాలనుకుంటే తినండి’ అని డ్రైవర్ స్పష్టంగా చెప్పేస్తాడు. రైలులో అయితే రకరకాల చిరుతిండ్లు వస్తూనే ఉంటాయి. ట్రెయిన్ ఆగిన నగరంలో.. నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకునే వెసులుబాటూ ఉంది. మరి విమానాల్లో? నిన్న మొన్నటి వరకూ మొక్కుబడి తిండే లభించేది. ఇప్పుడిప్పుడే మెనూ మారుతున్నది.
ఒకప్పుడు గగన ప్రయాణికులకు విమానయాన సంస్థలే ఫలహారాలు ఇచ్చేవి. పోటీ పెరిగిపోయి.. టికెట్ల ధరలు పడిపోయాక ఆ బాధ్యత నుంచి మెల్లగా తప్పుకొన్నాయి. మంచినీళ్లు మాత్రం అందిస్తున్నాయి. ఫ్లైట్లో ఏం తినాలన్నా కొనాల్సిందే. అంత డబ్బు పెట్టినా.. రుచీపచీ ఉండదు. తప్పదు కాబట్టి పొట్ట నింపుకోవాల్సిందే. మేఘాలలో తేలిపోతూ.. మనసుకు నచ్చిన రుచుల్ని ఆస్వాదించే అదృష్టమే ఉండేది కాదు. కస్టమర్ దేవుడికి నైవేద్యం విషయంలో లోటు చేస్తే.. తమ ఉనికికే ప్రమాదమని విమానయాన సంస్థలు గుర్తించాయి. దీంతో మెనూ మార్చేస్తున్నాయి. కొత్త రుచులు జోడిస్తున్నాయి. అవసరమైతే ఫుడ్ స్టార్టప్స్తో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మీల్ ఆఫ్ ద మూమెంట్, యూఫుడ్ ల్యాబ్స్, ఆర్గానిక్ రూట్స్, ది టేస్టీ కంపెనీ, త్రిగుణి ఈజీ ఈట్స్ వంటి కంపెనీలు విమానాల్లో విందుల బాధ్యత తీసుకుంటున్నాయి. ఇంకేముంది, ఆవురావురుమంటూ ఆమ్లెట్ తినొచ్చు. బిర్యానీ ఆరగించి బ్రేవ్మనొచ్చు. ఉప్మా లాగిస్తూ ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు.
పెరుగుతున్న ఇంధన ధరలు, సిబ్బంది జీతభత్యాలు, .. ఇలా రకరకాల కారణాలతో విమానయాన సంస్థ మనుగడ దినదినగండంగానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఫ్లయిట్లను ఓ మోస్తరు రెస్టారెంట్లుగా మార్చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. రుచికరంగా అనిపిస్తే కస్టమర్లు ఎంత డబ్బు పెట్టడానికైనా వెనుకాడరు. ఇంకేముంది, వింతైన వంటకాలు సిద్ధం అయిపోతున్నాయి. అదే సమయంలో జనంలో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది. దీంతో ఆర్గానిక్ మంత్రాన్ని అందు కుంటున్నారు. మిల్లెట్ రుచులు అందించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. త్వరలోనే.. విమాన టికెట్ కంటే భోజనాల ఖర్చులే తడిసిమోపెడు అవుతాయేమో!
భోజన తయారీ సంస్థలు ఇండిగో, ఆకాశ, ఎయిరిండియా, స్పైస్జెట్, ఎయిర్ ఏషియాతో టైఅప్ అవుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు వెరైటీ ఫుడ్ సప్లై చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో ఎయిర్ లైన్కూ 30వేల నుంచి 2లక్షల మీల్ బౌల్స్ పంపుతున్నారు. ప్లెయిన్ ఉప్మా, పోహా, నెయ్యి ఉప్మా, పాస్తా, బిర్యానీ, ఫ్రైడ్రైస్ వగైరా సర్వ్ చేస్తున్నారు.
ఈ సంస్థ ప్రత్యేకించి లగ్జరీ ప్రైవేట్ జెట్స్లో ప్రయాణించే వారికి ఆహారం అందిస్తున్నది. ఆర్డర్లు కూడా ప్రైవేట్ జెట్స్ నుంచే ఎక్కువగా వస్తాయి. పాస్తా, క్యారెట్ హల్వా వగైరా రుచులు భారీ పరిమాణంలో సరఫరా చేస్తున్నారు.
పేరుకు తగ్గట్టే పక్కా సేంద్రియ ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. రెడీ టు ఈట్ మిల్లెట్ ఐటమ్స్ను స్పైస్ జెట్ లాంటి ఎయిర్ లైన్స్కు అందిస్తున్నారు. చిరుధాన్యాల చిరుతిళ్లు, ఫలహారాలు వీళ్ల స్పెషల్.
ఉప్మా, పులిహోర, బిసిబేళాబాత్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ వంటి హోమ్లీ మసాలా ఫుడ్ ఇండిగో వంటి సంస్థలకు అందిస్తున్నది. ఇండిగోతో టైఅప్ తర్వాత మార్కెట్ పెరిగింది. కొత్త ఆఫర్లు వస్తున్నాయి.
ఈ సంస్థ ప్రతినిధులు మొదటి హైదరాబాద్ విమానయాన సంస్థ అయిన ట్రూజెట్తో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఆకాశ, ఇండిగో కంపెనీలకు రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలు అందిస్తున్నారు. రొయ్యల బిర్యానీ, కోడికూర, తెల్లన్నం, పప్పన్నం, దాల్ మఖానీ, ఓట్ మీల్, ఇతర రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ రుచులు సరఫరా చేస్తున్నారు.