అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న మూడు రాజధానుల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర, వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఏపీలో మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. మూడు రాష్ట్రాలు చేస్తే సీఎం పదవి కోసం జగన్ కుటుంబంలో గొడవ తీరుతుందని పేర్కొన్నారు.
ఒక రాష్ట్రానికి జగన్, మరో రాష్ట్రానికి షర్మిల, ఇంకొక రాష్ట్రానికి విజయసాయిరెడ్డి సీఎం కావచ్చని, దీంతో వారి సమస్య తీరుతుందని సూచించారు. షర్మిల ఇంటి పంచాయితీని తెలంగాణలో పెట్టడం సరికాదని అన్నారు. అవసరమైతే ప్రధాని మోదీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై షర్మిల చేస్తున్న ఆరోపణలపై జగ్గారెడ్డి మండిపడ్డారు.
‘ షర్మిలా నోరు అదుపులో పెట్టుకో..ఆడపిల్ల ఎలా మాట్లాడాలో’ అలా మాట్లాడు అని సూచించారు. మళ్లీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తానని హెచ్చరించారు. వైఎస్సార్ గుణాలు షర్మిలకు ఏ మాత్రం లేవని అన్నారు.