వాషింగ్టన్ : బ్రిటిష్ రాజకుంటుంబంపై మేఘన్ మెర్కెల్, ఆమె భర్త హ్యారీ చేసిన ఆరోపణలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని, హృదయవిదారకంగా ఉన్నాయని బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అన్నారు. పిల్లాడి చర్మం రంగుపై అనుమానాల విషయంలో మెర్కెల్ అనుభవం ప్రపంచానికి గుణపాఠం అవుతుందని ఆమె పేర్కొన్నారు. బ్రిటన్ రాజకుటుంబం తన కుమారుడి చర్మం రంగు గురించి ఆందోళన వ్యక్తం చేశారని, బకింగ్హమ్ ప్యాలెస్లో ఉన్నప్పుడు ఒంటరితనం అనుభవించానని ఇటీవల మెర్కెల్.. ఒప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో మేఘన్ చేసిన ప్రకటనపై మిషెల్ ఒబామాను మీడియా ప్రశ్నించగా.. “ఇది వినడానికి హృదయ విదారకంగా ఉందని భావిస్తున్నాను. ఆమె తన సొంత కుటుంబంలో ఉన్నట్లు భావించింది. ఆమె సొంత కుటుంబం ఆలోచన ఆమెకు భిన్నంగా ఉన్నది. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా.. ఈ ప్రపంచంలో రంగు జాతి వారి కోసం కొత్త నిర్మాణం జరుగదు. కాబట్టి ఆమె భావాలను వినడం, వాటిని వ్యక్తీకరించడం పట్ల తనకెలాంటి ఆశ్చర్యం కలుగలేదు” అని ఆమె చెప్పింది. “నేను ఆశిస్తున్న విషయం, నేను ఆలోచించే విషయం ఏమిటంటే.. ఇది మొదటగా ఒక కుటుంబం. వారి కోసం క్షమ, మానసికోల్లాసం కోసం నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా వారు మనందరికీ బోధించదగిన క్షణంగా దీనిని ఉపయోగించుకోవచ్చు” అని మిషెల్ ఒబామా అన్నారు.
ఎలిజబెత్ రాణి గత మంగళవారం మాట్లాడుతూ, తన మనవడు హ్యారీ, అతని భార్య చేసిన వ్యాఖ్యల పట్ల రాజకుటుంబం తీవ్ర మనోవేధనకు గురైందని, వారి కుమారుడికి సంబంధించిన జాత్యహంకార వ్యాఖ్య గురించి వెల్లడించిన విషయాలను ప్రైవేటుగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
బ్రిటన్ రాయల్స్ జాత్యహంకారమనడాన్ని హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియం ఖండించారు.