రాజకీయ పార్టీల ఆలోచనల మేరకు దర్శకులు సినిమాలు చేయకూడదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్. వాస్తవాన్ని వక్రీకరించి చూపడం ద్వారా ప్రజలకు తప్పుడు సందేశాలు పంపించిన వారవుతారని ఆయన చెప్పారు. చిత్ర రూపకల్పనలో దర్శకులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలన్నారు. ‘అంకుర్’, ‘నిషాంత్’, ‘మంథన్’, ‘భూమిక’ లాంటి చిత్రాలతో సమాంతర సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడిగా శ్యామ్ బెనగల్ ప్రసిద్ధుడు. సినీ పరిశ్రమ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నారు. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జీవిత కథ ఆధారంగా ‘ముజిబ్, ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ బెనగల్ మాట్లాడుతూ…‘ముజిబ్ సినిమా భారత, బంగ్లాదేశ్ సంస్కృతికి, చరిత్రకు ప్రతిబింబంగా ఉంటుంది. దేశాన్ని నిర్మించడంలో నాయకుడిగా ముజిబుర్ చూపిన సాహసం, వ్యక్తిత్వం నన్ను బాగా ఆకర్షించింది. ఇదొక చరిత్ర, దీన్ని వక్రీకరించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ మధ్య కొందరు దర్శకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇది సరికాదు’ అన్నారు. ఈ చిత్రంలో అరిఫీన్ షువూ ముజిబుర్ పాత్రలో నటిస్తున్నారు.