అమీర్పేట్, మార్చి 23 : ప్రజలకు కావాల్సింది ‘కశ్మీర్ ఫైల్స్’ కాదు… ఉద్యోగాలు, నీళ్లు అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు మతపరమైన ఘర్షణలు, కర్ఫ్యూ వంటివి చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. బుధవారం ఎస్ఆర్నగర్లో జలమండలి ఎన్నికల ప్రచారం నిమిత్తం టీఆర్ఎస్ కేవీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్వమతాలకు సమప్రాధాన్యం ఉందన్నారు. కశ్మీర్ ఫైల్స్ అంటూ ఊదరగొడుతున్న వారు ఆ ఘర్షణలకు కారకులైన వారిని శిక్షించడం , బాధితులను ఆదుకోవడం వంటి బాధ్యతలు ఏమైనా తీసుకున్నారా? అంటూ పల్లా ప్రశ్నించారు. ప్రశాంత హైదరాబాద్ను కాపాడుకునేందుకు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మతతత్వ పార్టీలు అధికారంలోకి వస్తే బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరే వరకు గుండెలు అరచేతిలో గడపాల్సి వస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో అటువంటి పరిస్థితి ఎన్నటికీ రాదని స్పష్టం చేశారు.