న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్యాయని, టీకాలు వేయకపోతే కరోనా తడవలు తడవలుగా వ్యాపిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పందిస్తూ.. రాహుల్ ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంగతి చూసుకోవాలని మండిపడ్డారు. ఆ రాష్ట్రాల్లో అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, మే 1 నుంచి 18-44 వయసుల వారికి జారీచేసిన కోటా ఇంతవరకు తీసుకోలేదని కేంద్రమంత్రి అన్నారు. 2021 సంవత్సరం ముగిసేలోగా దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందుతుందని చెప్పారు. అయితే అందుకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. రాహుల్ గాంధీకి టీకాల మీద శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో టీకాల పంపిణీ చూసుకోవాలని జావడేకర్ అన్నారు. కేంద్రం కోవిడ్ నివారణకు చేపడుతున్న చర్యలు సరిగా లేవని విపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రస్తావించినప్పుడు.. ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని దుమ్మెత్తి పోసేందుకు కాంగ్రెస్ ‘టూల్కిట్’ ఉంది కదా అని జావడేకర్ సమాధానమిచ్చారు. అంతకుముందు రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ.. కరోనా రెండోవిడత సంక్షోభానికి ప్రధాని నరేంద్రమోదీ కారకుడని, ఆయనకు కరోనా అంటే ఏమిటో అర్థం కాలేదని అన్నారు. కరోనాకు టీకాలే శాశ్వత పరిష్కారమని, సామాజిక దూరం, మాస్కులు తాత్కాలికమైనవని పేర్కొన్నారు. సరైన టీకాల వ్యూహం లేకపోతే ఇండియా పలు విడతల కరోనా కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.