శ్రీనగర్: కశ్మీర్ అంటేనే మంచు. కానీ ఈ ఏడాది వింటర్లో అక్కడ హిమపాతం లేకుండాపోయింది. టూరిస్టులను తెగ అట్రాక్ట్ చేసే గుల్మార్గ్(Gulmarg)లో అసలు మంచే లేకుండా పోయింది. శీతాకాలంలోనూ మంచు కురవకపోవడం స్థానికుల్ని, యాత్రకుల్ని కలవరపెడుతోంది. జనవరి 8వ తేదీ వరకు ఈ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. డిసెంబర్లో సుమారు 79 శాతం వర్షపాతం తక్కువ నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతో స్కీయింగ్ పర్యాటకులకు కూడా గడ్డుకాలమే ఎదురవుతోంది.
ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది మంచు కురవడం లేదని నిపుణులు అంటున్నారు. పసిఫిక్ సముద్రంలో వేడి వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతున్నట్లు భావిస్తున్నారు. టూరిస్టులు, స్పోర్ట్స్ లవర్స్ మాత్రమే కాదు.. స్నో ఫాల్ లేకపోవడం వల్ల నీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గుల్మార్గ్ లాంటి ప్రాంతాల్లో భవిష్యత్తులో మరింత కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.