బ్రసెల్స్ : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ స్పష్టం చేశారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరుపడం లేదని, అది అనవసరం తేల్చి చెప్పారు. ఆఫ్ఘన్ నుంచి తిరిగి వచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతా ధృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్కు అందిస్తున్న సాయాన్ని 57 మిలియన్ యూరో (67 మిలియన్ డాలర్లు)లకు పెంచాలని ప్రతిపాదించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈయూ సహాయం మానవ హక్కులను గౌరవించడం, మైనారిటీల సంక్షేమం, మహిళలు.. బాలికల హక్కులను గౌరవించడంతో ముడిపడుతుందన్నారు. శరణార్థుల పునరావాసానికి సహాయపడే ఈయూ దేశాలకు నిధులు అందించేందుకు కమిషన్ సిద్ధంగా ఉందని, వచ్చే వారం జరిగే జీ7 సమావేశంలో పునరావాస సమస్యను లేవనెత్తాలని యోచిస్తున్నట్లు చెప్పారు.