డీజీపీ మహేందర్రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 30 : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం శుక్రవారం నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించినట్టు డీజీపీ ఎం మహేందర్రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు కఠినంగా అమలుచేయాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందరూ విధిగా మాసులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్ ధరించని వారికి నిబంధనల ప్రకారం రూ.వెయ్యి ఫైన్ విధించనున్నట్టు స్పష్టం చేశారు. అనుమతి పొందిన కార్యక్రమాల్లో విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని డీజీపీ సూచించారు.