నో మోటార్ వెహికిల్ డే షూరూ..
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్
ఈనెల 31 వరకు సైకిల్ వినియోగించేల ప్రణాళికలు
ఇప్పటికే 70 మంది సైకిల్పైనే ప్రయాణం
పర్యావరణ హితానికి కలిసిరావాలని పిలుపు
సిటీబ్యూరో, డిసెంబర్ 29 : పర్యావరణ హితం కోసం హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే 13 రాష్ర్టాల మీదుగా 23 రోజులు.. ఎలాంటి ఆటంకం లేకుండా 3,700 కిలో మీటర్లు కశ్మీర్ టూ కన్యాకుమారి యాత్రను దేశంలోనే 13 మందితో మొదటిసారిగా విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించిన సైక్లిస్టు గ్రూప్ ఇప్పుడు మరో ఆదర్శ కార్యక్రమానికి బాటలు వేసింది. అదే నో మోటార్ వెహికిల్ డే. దీని ఉద్దేశం.. వాహనానికి బదులు బైస్కిల్ వినియోగించడం.
ఆఫీస్ నుంచి ఇంటికి.. ఇతర ప్రయాణ అవసరాలన్నింటికి సైకిల్పైనే వెళ్లడం. ఒక్క రోజు వాహనంతో వచ్చే ఖర్చు.. సైకిల్పై వెళితే మిగిలే ప్రయోజనం.. ఆరోగ్యం నుంచి కాలుష్యం వరకు ప్రతీది లెక్కించి వివరాలను షేర్ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఫౌండర్ రవీందర్ తెలిపారు. ఈనెల 31 వరకు నో మోటార్ వెహికిల్ డే కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికే 130 మంది ఈ ఛాలెంజ్లో భాగస్వామ్యమయ్యారు.సోషల్ మీడియాలో నోమోటార్ వెహికల్ డేకు విశేష స్పందన వస్తుంది.
సైకిల్ తొక్కడంతో ప్రయోజనాలు
సైకిల్ తొక్కడం వలన కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలను చాటి చెబుతూ హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సైకిల్ ఉపయోగాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ కారణంతో సైకిళ్ల వాడకం పెరిగిపోయింది. చిన్న పిల్లలు ఆడుకునే సైకిల్ను కూడా రిమోట్ సెన్సార్తో తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు ప్రయాణాలకు సైకిల్ ఆధారం. కానీ ఇప్పుడు అవి మరుగునపడే పరిస్థితి వచ్చింది.
శారీరక శ్రమను బలోపేతం చేయడం, మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చని నిపుణులు
చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
సైకిల్ తొక్కడం వలన కండరాలు బలపడుతాయి.
నడుమునొప్పి, మెడనొప్పి, నరాలు లాగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
అధిక రక్తపోటును నివారించడంలో సైక్లింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
నిద్రలేమికి సైక్లింగ్తో చెక్ పెట్టొచ్చు.
మధుమేహం, గుంజె జబ్బులు, శ్వాసకోశ, స్థూలకాయం నుంచి రక్షించుకోవచ్చు.
పెట్రోల్ వినియోగం తగ్గిద్దాం
పెట్రోల్తో నడిచే వాహనాలన్నీ వారం రోజులు ఆపేసి బదులుగా సైకిల్ను వినియోగిద్దాం. పర్యావరణ హితం కోసం సైకిల్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతీ రోజు సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలం. రోజువారి కార్యక్రమాలన్నింటికీ వాహనాన్ని వాడటం ఇన్నాళ్లు చేశాం. ఇకపై వాటిలో కనీసం గ్రాసరీస్, మెడిసిన్స్, జిమ్, పార్క్, సెలూన్, ఆఫీస్ ఇలా అన్నింటికి సైకిల్ వాడకం చేయాలనేదే మా ఉద్దేశం. సైకిల్ రైడ్కు చాలా మంది నుంచి స్పందన వస్తుంది. రోజు నమోదయ్యే కాలుష్య వివరాలు కాస్త తగ్గుతాయి. పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. -రవీందర్ నందనూరి, ఫౌండర్, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్.
చాలా మంది సైకిల్ కొన్నారు
నేను నో మోటార్ వెహికిల్ డే ఛాలెంజ్ను స్వీకరించాను. ప్రతీ రోజు చిన్న అవసరానికి కూడా బైక్ను వినియోగించేవాన్ని. ఇప్పుడు కచ్చితంగా సైకిల్పైనే వెళుతున్నాను. ఇంట్లో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందరూ ప్రశంసిస్తున్నారు. నన్ను చూసి మా కాలనీలో కూడా చాలా మంది సైకిల్స్ కొనుగోలు చేశారు. సైకిల్ తొక్కడమనేది కేవలం ఛాలెంజ్ కోసమే కాదు అందులో మన ఆరోగ్యం, పర్యావరణ శ్రేయస్సు దాగి ఉంది. ఈ కార్యక్రమానికి అందరు కలిసిరావాలి. -ఉమా మహేష్, బ్యాంక్ మేనేజర్.
రోజు 90 కిలో మీటర్లు సైకిల్పైనే
సైకిల్ వినియోగం పెరగాల్సిన అవసరం చాలా ఉంది. ఈ తరం పిల్లలకు సైకిల్స్ కూడా రిమోటింగ్ సెన్సార్లో వస్తున్నాయి. అలా కాదు సైకిల్ తొక్కడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నేను ఆదిబట్లలోని నా ఆఫీస్కు రోజూ సైకిల్పైనే వెళుతున్నాను. రోజులో కనీసం 90కిలో మీటర్లు సైకిల్పైనే ప్రయాణిస్తున్నాను. నో మోటార్ వెహికిల్ డే ప్రాధాన్యతను అందరి చాటిచెబుతున్నా. రవీందర్ మంచి ఛాలెంజ్ విసిరారు. సమాజశ్రేయస్సుకు అందరూ స్వీకరించాలి. – ఎం. శ్రీధర్, ఇంజినీర్.
వ్యాధులకు దూరం
నా వయస్సు 70. సైకిల్ తొక్కడమంటే చాలా ఇష్టం. రోజువారి కార్యకలాపాల్లో సైక్లింగ్ భాగం కావాలి. ప్రతి ఒక్కరికి తన చిన్నతనంలో సైకిల్తో అనేక జ్ఞాపకాలు ఉంటాయి. కాలక్రమేణా సైకిల్ వినియోగం తగ్గుతుంది. వంద అడుగుల దూరానికి కూడా వాహనాలనే వినియోగిస్తున్నారు. అది చాలా ప్రమాదం. సైక్లింగ్తోనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. 80 శాతం వ్యాధులను సైక్లింగ్తో రాకుండా అడ్డుకోగలం. దేశవ్యాప్తంగా సైక్లింగ్ వినియోగం పెరగాలని హైదరాబాద్ వేదికగా అనేక కార్యక్రమాలను చేపట్టాం. హెచ్సీజీని ఏర్పాటు చేసి సైక్లింగ్పై అవగాహన కల్పిస్తున్నాం.
– రాజ్కుమార్. ఎం