హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మృతిచెందిన మరియమ్మ కేసు వ్యవహారంలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) దాఖలు చేసిన పిల్పై విచారణను హైకోర్టు ముగించింది. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నదని, తాము తదుపరి ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. పోలీసులపై నమోదైన కేసుల్లో దర్యాప్తును సత్వరమే పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ పిటిషన్ను పరిశీలించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రభుత్వం బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, కుటుంబసభ్యులకు పరిహారం అందజేసిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొద్దని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పులో ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా పోలీసులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు సత్వరమే పూర్తిచేయాలని సూచించింది. ప్రజల్లో విశ్వాసం కల్పించాలని, దర్యాప్తునకు తారిక ముగింపు పలకాలని పేర్కొంది.