చండీగఢ్: ఒక మహిళకు అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే నైట్ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్, వైద్య సిబ్బంది అక్కడ లేరు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పార్కింగ్ స్థలంలోనే ఆ మహిళ ప్రసవించింది. (Woman Gives Birth In Hospital Parking) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ సంఘటన జరిగింది. బడోలి ప్రాంతానికి చెందిన బలేష్ అనే మహిళకు అర్ధరాత్రి వేళ ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో ఆదివారం తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో ఫరీదాబాద్ సెక్టార్ 3లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మహిళను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేసరికి మెయిన్ గేట్కు లోపల నుంచి లాక్ వేసి ఉన్నది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పలుమార్లు గేటు కొట్టి సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ స్పందించలేదు. పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రి వెనుక గేటు ద్వారా ఆమెను లోపలకు తీసుకెళ్లారు. డాక్టర్లు, నర్సుల కోసం వెతికారు. అయితే అక్కడ ఎవరూ కనిపించలేదు.
మరోవైపు అత్యవసర వైద్యం కోసం ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువైన మహిళ సహాయానికి ముందుకు వచ్చింది. దీంతో ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంలో మొబైల్ ఫోన్లోని టార్చిలైట్ వెలుగులో మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లి, నవజాత శిశువును ఆసుపత్రి లోపలకు తరలించారు.
అయితే ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. అత్యవసర పరిస్థితి సమయంలో స్టాఫ్ నర్సు, మరో ఉద్యోగి గైర్హాజరు కావడం, రాత్రి డ్యూటీలో లోపాలున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ఇద్దరు ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేశారు.