డ్రాగన్ ఫ్రూట్ సాగుపై జిల్లా రైతాంగం దృష్టి సారించింది. గతంలో ఈ ప్రాంతానికి పరిచయం లేని ఈ తోటలు జిల్లా నలుమూలలా విస్తరిస్తున్నాయి. భువనగిరి, చౌటుప్పల్, మోటకొండూరు, రామన్నపేట, మోత్కూరు దాదాపు20 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఇప్పటికే తొలి పంట తీసిన రైతులు మంచి ఫలితాలు పొందినట్టు చెప్తున్నారు. దీనికి నీటి వినియోగం కూడా చాలా తక్కువ.
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పంటలు, పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో డిమాండ్ కొద్దీ పలువురు రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. బ్రహ్మజముడు పండ్లను పోలి ఉండే డ్రాగన్ ఫ్రూట్ సాగు ఐదారేండ్లుగా పెరుగుతున్నది. పై భాగం ఎర్రగా, లోపల గుజ్జు తెలుపు, గులాబీ, పసుపు రంగులో ఉంటుంది. చైనా, వియత్నాం, ఆమెరికా దేశాల్లో మాత్రమే పండే ఈ పంట ప్రస్తుతం మనదేశంలో విస్తరిస్తున్నది. ఎకరానికి రూ.5 నుంచి 7లక్షల పెట్టుబడి వస్తుంది. మొక్కకు రూ.40,ఎకరానికి 2 వేల మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు ఎదిగేందుకు 600 పోల్స్, కాంక్రీట్ రింగులు వేయాల్సి ఉంటుంది.
సేంద్రియ ఎరువులతోనే సాగు..
డ్రాగన్ ఫ్రూట్ సాగులో రసాయన ఎరువుల వినియోగం ఉండదు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తారు. వేప పిండి, పశువుల పేడ వేసి మొక్కను నాటుతారు. చెట్ల మొదలులో గడ్డి పెరుగకుండా వరిపొట్టును పోస్తారు. నాటిన మొక్కకు నెలకోసారి డీకంపోజర్ను డ్రిప్ ద్వారా అందిస్తారు. ఒక్కో మొక్కను 10X8 అడుగుల వెడల్పులో నాటుతారు. సిమెంట్ పోల్ 7 అడుగుల ఎత్తులో ఉండాలి. ఆధారం లేకుండా చెట్టు పెరగదు కాబట్టి సపోర్టుగా సిమెంట్ పోల్స్వేసి, వాటిపై సిమెంట్ కాంక్రీట్ రింగులు వేయాలి. సుమారు 12 నెలల తరువాత దిగుబడి వస్తుంది. ఆర్గానిక్కు అనుకూలమైన పంట కావడంతో చీడ పీడలు తక్కువ. పశువుల ఎరువులు, జీవామృతం, డీకంపోజ్డ్ బ్యాక్టీరియాను మార్చి వాడుకుంటే దిగుబడి పెరుగుతుంది. మొక్క పెరుగుతున్నా కొద్ది పిల్ల కొమ్మలను తొలగించాలి. 45.4 డిగ్రీల వరకు ఉష్టోగ్రతను తట్టుకుంటుంది. వేసవిలో ప్రతి మొక్కకు 20 లీటర్ల నీటిని అందించాలి.
జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులు వీరే..
భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతు బోయినపల్లి గోపాల్రెడ్డి 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. తాజాగా రెండో పంటను మార్కెట్కు తరలించాడు. మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనరసింహారెడ్డి 5 ఎకరాలు, రామన్నపేట మండలంలోని ఎన్నారం రైతు నల్ల అంజిరెడ్డి 2 ఎకరాలు, ఉట్నూరుకు చెందిన పానుగంటి పూలమ్మ ఎకరం, వలిగొండకు చెందిన గూడురు అంజిరెడ్డి 2 ఎకరాలు, మోత్కూరుకు చెందిన లింగపల్లి జ్యోతి ఎకరం, మోటకొండూర్ మండలంలోని దుర్శిగానిపల్లికి చెందిన కొత్తపల్లి లక్ష్మీనరసింహ ఎకరం, మోత్కూరు మండలం కొండగడపకు చెందిన ఆడప చంద్రమౌళి ఎకరం, అడ్డగూడూరుకు చెందిన రైతు తుప్పతి గిరి అర ఎకరం, చౌటుప్పల్ మండలం మల్కాపురం రైతు జింకల కృష్ణ ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు.
కొత్త పంట వేయాలనుకున్నా..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో మా బంధువు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి మంచి ఆదాయం పొందాడు. మొదట ఎకరంలో వేసిన ఆయన ప్రస్తుతం 20 ఎకరాల వరకు పెంచాడు. తోటను చూసిన తర్వాత నేను కూడా సాగు చేయాలని అనుకున్నా. 5 ఎకరాల్లో జనవరి నెలలో తోట పెట్టించాను. డ్రిప్ ఇరిగేషన్, చుట్టూ పెన్సింగ్తో కలిపి ఎకరానికి రూ.7 లక్షల వరకు ఖర్చు వచ్చింది. పస్తుతం మొదటి పంటగా 5 ఎకరాల్లో 50 కిలోల వరకు పంట వచ్చింది. రెండు మూడు నెలల్లో టన్ను వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
ఎకరానికి 6 టన్నుల దిగుబడి వచ్చింది
మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట పెట్టాను. మొదటి పంట ఎకరానికి టన్ను దిగుబడి వచ్చింది. ఈ ఏడాది దాదాపు 6 టన్నుల దిగుబడి వచ్చింది. 3 ఎకరాల పంటకు 18 టన్నులు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు తరలించాం. కిలో రూ.140 ధర పడింది. వ్యవసాయంలో మార్పు రావాలన్నదే నా ఉద్దేశం. గతంలో మల్బరీ, వేప సాగు చేస్తే పెట్టుబడి కూడా మిగల్లేదు. డ్రాగన్ ఫ్రూట్కు గిరాకీ ఉన్నదని తెలిసి సాగు చేశా.