నిజామాబాద్ క్రైమ్,నవంబర్ 25: మహిళల రక్షణ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయగా..సీపీ హాజరయ్యారు. ఉమెన్ హెల్ప్ డెస్క్కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడే అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న పిల్లల కోసం 1098 (చైల్డ్లైన్), మహిళలు, పిల్లలు ఏ రకమైన హింసకు గురైనా 181 (ఉమెన్ హెల్ప్లైన్) నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం బ్రూణహత్యలు, మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ సూచించారు. తెలంగాణలో కూడా మహిళల రక్షణ కోసం హాక్-ఐ యాప్ ను రాష్ట్ర పోలీస్ శాఖ ఏర్పా టు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్బాబు, కామారెడ్డి ఏఎస్పీ అనోన్య, నిజామాబాద్, ఆర్మూర్ పోలీసు అధికారులు వెంకటేశ్వర్, ఆర్.ప్రభకర్రావు, రమేశ్, జిల్లా సంక్షేమ అధికారిణి కే.సుధారాణి, మహిళా సంక్షేమ అధికారిణి పి.స్వప్న, రైల్వే ఎస్సై జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.