సాగు, రవాణాపై నిషేధం ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలుతూనే ఉంది. నిఘాలోపం, నిర్లక్ష్యం కారణంగా అక్రమ రవాణా సాగుతూనే ఉంది. స్మగ్లర్లు, సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్రప్రభుత్వం.. గంజాయిని, గుడుంబాను కట్టడి చేసింది. అయితే పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి అడ్డదారుల్లో గంజాయి జిల్లాకు తరలివస్తున్నది. గంజాయిని సమూలంగా నిర్మూలించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు కార్యాచరణను సిద్ధంచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖలు పెద్దఎత్తున దాడులు చేస్తూ అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తుండగా.. నిజామాబాద్లో రెండు శాఖల మధ్య సమన్వయలేమితో ప్రణాళిక అమలు కావడం లేదు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 10కేసులు వెలుగుచూడగా..110 కిలోల గంజాయి పట్టుబడింది.
నిజామాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరం. ప్రభుత్వం నిషేధించినా… సాగు తగ్గినా రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉంది. నిఘా, తనిఖీల లోపంతో దళారులకు రూ.లక్షల వ్యాపారం కలిసొచ్చేలా చేస్తోంది. ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువతే లక్ష్యంగా ఎండు గంజాయి ప్యాకెట్లు విచ్చలవిడిగా సరఫరా చేస్తూ అమాయకులను మత్తు రొంపిలోకి దించుతున్నారు. బానిసలుగా చేసి వారితో వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నారు. ఫలితంగా గంజాయి మూలంగా అభం శుభం తెలియని అమాయకుల జీవితాలు రోడ్డున పడుతున్నా యి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి సంఘ విద్రోహ చర్యలపై ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, గుడుంబాను పకడ్బందీగా కట్టడి చేసింది. మరోమారు పొరు గు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఇబ్బడిముబ్బడిగా గంజాయి సరఫరా జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోకి అక్రమ వ్యాపారం చొచ్చుకెళ్తుండగా గంజాయి సాగు సైతం వెలుగు చూస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని నామరూపాల్లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో పోలీసులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. నిజామాబాద్లో ఆబ్కారీ, పోలీసుల సమన్వయం లేమితో ప్రణాళిక పక్కాగా అమలు కావడం లేదు. కామారెడ్డి జిల్లాలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నది.
గంజాయి కేసులు ఇలా…
నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా విచ్చలవిడిగా గంజా యి రవాణా జరుగుతున్నది. ఇందుకు అప్పుడప్పుడు నమోదైన కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2016లో 17 కేసులు నమోదు కాగా 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2017లో 24 కేసుల్లో 38 కేజీలు, 2018లో 9 కేసుల్లో 17 కిలోలు, 2019లో 12 కేసుల్లో 28 కేజీలు, 2020లో 11 కేసుల్లో 175 కేజీలు గంజాయి పట్టుబడింది. 2021లో ఇప్పటి వరకు 10 కేసులు వెలుగు చూడగా 110 కిలోల గంజాయి పట్టుబడినట్లుగా పోలీసుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు రెగ్యులర్ విధులతో పాటు గంజాయి సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు పోలీసులు సన్నద్ధం కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా గుడుంబా, గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది. నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గం, కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనే అత్యధికంగా గంజాయి, గు డుంబా స్థావరాలు నెలకొన్నాయి. అప్పుడప్పుడు ఆబ్కారీ, సివిల్ పోలీసుల దాడుల్లో ఈ విషయం వెలుగు చూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అధికారులు పకడ్బందీ చర్యలకు ఉపక్రమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
కామారెడ్డిలో అలా… నిజామాబాద్లో ఇలా…
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో గంజాయి అక్రమ రవా ణా, సాగుపై పోలీసులు తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడం విస్తుగొల్పుతున్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో గుట్కా నిల్వలను పట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపేందుకు తనిఖీలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలానికి సరిహద్దు కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లా మోపాల్, ఇందల్వాయి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు గుట్టుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో తనిఖీలకు పోలీసులు వెనుకడుగు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజామాబాద్లో ఎక్సైజ్, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రభుత్వం నిర్దేశించుకున్న భారీ లక్ష్యం నీరుగారుతున్నట్లుగా కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లాలో అక్టోబ ర్ 24 నుంచి పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఎక్సైజ్, మరోవైపు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నారు. 24వ తేదీన ఒకే రోజు 42 కేసులు బుక్ చేశారు. ఇందులో 41 కేసులు నిషేధిక గుట్కా ఉండగా, గాంధారి మండలం చద్మల్ తండాలో 10 గంజాయి మొక్కలు పట్టుబడడంతో మరో కేసు నమోదైంది. వరుసగా దాడులు నిర్వహిస్తూ నిషేధిత పదార్థాలతో పాటు గంజాయి సాగు, రవాణాపై పకడ్బందీ నిఘాను పెట్టారు.
మూలాలపై దృష్టి సారిస్తారా…?
గంజాయి, గుడుంబా అక్రమ దందాపై పోలీసులు, ఆబ్కారీ శాఖలు సమన్వయంతో పని చేస్తే కట్టడి చేయడం సులువైన ప్రక్రియే. క్షేత్రస్థాయిలో సివిల్ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందికి మధ్య సమన్వయలేమితో స్మగ్లర్లు తమకు అనుకూలంగా మా ర్చుకుంటున్నారు. పేరు మోసిన దుండగులైతే ఒకడుగు ముం దుకేసి ప్రత్యక్షంగా ఖాకీలతో సంబంధాలు సైతం పెట్టుకున్నట్లుగా ఉభయ జిల్లాల్లో పలువురిపై ఆరోపణలున్నాయి. చూసీచూడనట్లుగా సంబంధిత అధికారులు వ్యవహరించడంతో పూర్తిగా కట్టడి అయిన గంజాయి సాగు ఇప్పుడు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసి న నేపథ్యంలో ఆబ్కారీ, పోలీసు శాఖలు నేరుగా క్షేత్ర స్థాయి లో విస్తృతంగా పర్యటిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
కార్యాచరణ సిద్ధం..
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తాం. గంజాయి సాగును కట్టడి చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధమైంది. త్వరలోనే తనిఖీలు విస్తృతంగా చేపడతాం. గంజాయిని సాగు చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు. కటకటాలకు పంపిస్తాం.
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ఆరెస్టు
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 28 : జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో షేక్ నజీర్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు గురువారం అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర తెలిపారు. నిందితుడి నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సోదాల్లో సీఐ రఘునాథ్, ఎస్సై వాణి, చంద్రమోహన్, నర్సయ్య, గోపి, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.