మెండోరా, అక్టోబర్ 26 : మండలంలోని ఎస్సారెస్పీ జెన్కో విద్యుత్ ఉత్పతి కేంద్రంలో సోమవారం రాత్రి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సీజన్లో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 75 మిలియన్ యూనిట్లుగా ఉన్నత అధికారులు నిర్ణయించగా సోమవారం రాత్రిలోపు 75.5217 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సీజన్లో ప్రారంభం నుంచి వరద 95 రోజులుగా ఎస్సారెస్పీకి వచ్చిందన్నారు. దీంతో కాకతీయ కాలువకు, ఎస్కేప్ గేట్లకు నీటివిడుదల చేపట్టడంతో లక్ష్యం దిశగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైనట్లు తెలిపారు. లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సీజన్ పూర్తి లోగా మరింత విద్యుత్ను ఉత్పత్తి చేస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యం చేరినందుకు అధికారులు, సిబ్బందిని జెన్కో చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్రావు ఈ సందర్భంగా అభినందించారు.