పిట్లం/ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 26 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంభాపూర్ గ్రామంలో పోలీసులు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి విఠల్ తన ఇంటి ఎదుట పెరటిలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి మంగళవారం దాడి చేశామని, 60 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని తహసీల్దార్ రామ్మోహన్రావు సమక్షంలో పంచనామా నిర్వహించి విఠల్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పైడిమాల్ గ్రామ పరిధిలోని కొకల్దాస్ తండాలో ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ సాయన్న తన బృందంతో దాడి చేశారు. తండాలోని రెండు ఇండ్ల ఆవరణలో దాదాపు 7నుంచి 8అడుగుల ఎత్తులో పెరిగిన 40గంజాయి మొక్కలను గుర్తించారు. వాటిని ధ్వంసం చేసి రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బర్దావల్ కిషన్, తిథిర్యరాయిలాను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ సాయన్న తెలిపారు. సిబ్బంది బాలిరెడ్డి, సంగయ్య, సరిత, నవీన్ పాల్గొన్నారు.