నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 23 : పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఉన్న నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో డీపీవో జయసుధ, డీఎల్పీవోలు, మండల పంచాయతీ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడారు. మండలాల వారీగా నిర్దేశించిన ఇంటి పన్ను వసూలుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. కంపోస్ట్ షెడ్డుల్లో తడి, పొడి చెత్త నిర్వహణ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా నిర్వహించేలా ఎంపీవోలు పర్యవేక్షించాలన్నారు. రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన రిపోర్టులను, కార్యదర్శుల హాజరు సక్రమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎంపీవోలపై ఉందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల నిర్వహణలోనూ మండల పంచాయతీ అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం పల్లెప్రగతి పనులపై అడిషనల్ కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారులు గౌస్, శ్రీనివాస్, జిల్లా ఈ-పంచాయతీ ప్రాజెక్టు మేనేజర్ నరహరి, ఆయా మండలాల మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.