గాంధారి, నవంబర్ 2 : నాటు సారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గాంధారి మండలంలోని గండివేట్ తండాపై మంగళవారం దాడులు చేశారు. గాంధారి మండలంలోని గండివేట్ తండాలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తండా శివారులోని వాగు పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా బట్టీలను ఏర్పాటు చేసి, నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారంతోఅందడంతో దాడులు చేసినట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ ఎన్.రాణి తెలిపారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న నాలుగు బట్టీల ను ధ్వంసం చేయడంతో పాటు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 450 లీటర్ల బెల్లం పాకాన్ని, ఇప్ప పువ్వును పారబోసినట్లు తెలిపారు. త్వరలోనే నాటు సారాను తయారు చేసి, విక్రయిస్తున్న నిందితులను పట్టుకుంటామని తెలిపారు. నిషేధిత గంజాయిని సాగు చేయడం, నాటు సారా తయారు చేసినా.. విక్రయించినా సమాచారం ఇవ్వాలని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై రమేశ్ ,ఎస్సై రాధికతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్ ఎదుట ఆరుగురు బైండోవర్..
గతంలో నాటు సారా తయారు చేసి విక్రయించడంతో పాటు, గంజాయిని సాగు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం గాంధారి తహసీల్దార్ గోవర్ధన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని గండివేట్ తండాకు చెందిన జాట్రోత్ పీరు, నేనావత్ దోళీ, కేతావత్ సురేందర్, జాట్రోత్ శ్రీరాం, జాట్రోత్ రవి, బదావత్ సక్కున అనే ఏడుగురిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ గతం లో నాటు సారా తయారీతో పాటు, గంజాయి సాగు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు భవిష్యత్తులో తిరిగి తప్పు చేయకుండా ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎైక్సైజ్ ఎస్సైలు రమేశ్, రాధిక కానిస్టేబుళ్లు ఉన్నారు.
ధర్పల్లిలో ఒకరు..
ధర్పల్లి, నవంబర్ 2 : మండలంలోని మరియాతండాకు చెందిన బాదావత్ జమున అనే మహిళను తహసీల్దార్ జయంత్రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు భీమ్గల్ ఎక్సైజ్ ఎస్సై శంకర్ తెలిపారు. నాటుసారా కాస్తుందన్న సమాచారంతో దాడులు నిర్వహించి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి మరోసారి ఇలాంటి పనులు చేపట్టకుండా హెచ్చరించి బైండోవర్ చేసినట్లు చెప్పారు. నాటుసారా తయారు చేసినా.. గంజాయి సాగు చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
కామారెడ్డి, నవంబర్2 : తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూరు సౌత్క్యాంపస్ నుంచి పీజీ కోర్సులను మెయిన్ క్యాంపస్కు బదలాయిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో విద్యార్థి సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి స్పందించారు. ఈ నెల 30న జరిగిన పాలకమండలి సమావేశంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పీజీ కోర్సులను తరలించాలన్న అంశంపై చర్చమాత్రమే జరిగిందని, దానిపై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ అంశంపై నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. ఆయన స్పందించారు. ’భిక్కనూరు సౌత్క్యాంపస్ విషయంలో పాలకమండలి సమావేశంలో చర్చ జరిగింది. అయితే కోర్సుల తరలింపు నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నేను రిజిస్ట్రార్ అయ్యి నాలుగు రోజులే అవుతున్నది. పూర్తిస్థాయి లో పాలకమండలి మినిట్స్బుక్ చదివిన తర్వాత వివరాలు వెల్లడిస్తాను. పాలకమండలి సమావేశంలో ప్రస్తావన మాత్రమే వచ్చిందని తెలుసు. ప్రస్తుతం కోర్సుల తరలింపు జరిగే అవకాశం లేదు.’ అని ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు.
వచ్చే ఏడాది డిగ్రీ కళాశాల
ఏర్పాటుపై సంసిద్ధత వ్యక్తమైంది: మారయ్యగౌడ్
భిక్కనూరు సౌత్క్యాంపస్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ఇటీవలి పాలకమండలి సమావేశం సంసిద్ధత వ్యక్తంచేసిందని టీయూ ఈసీ సభ్యుడు మారయ్యగౌడ్ తెలిపారు. ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సౌత్ క్యాంపస్ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున.. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుగుణంగా ఉంటుందని సభ్యులు అభిప్రాయపడినట్లు చెప్పారు. ‘ పూర్తిస్థాయిలో విద్యార్థులు లేని పీజీ కోర్సులను సౌత్ క్యాంపస్ నుంచి డిచ్పల్లి మెయిన్ క్యాంపస్కు తరలించాలనే విషయం చర్చకు వచ్చింది. అయితే దానిపై పాలకమండలి సమావేశం తుది నిర్ణయం తీసుకోలేదు’ అని మారయ్యగౌడ్ పేర్కొన్నారు.