పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. జయప్రకాష్ నారాయణ్ (జేపీ)తో ఆయనకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మంగళవారం జేపీ 120వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన బీహార్లోని సితాబ్ దియారాలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ను ఆయన విమర్శించారు. ‘జయప్రకాష్ నారాయణ్ అధికారం కోసం కాదు సిద్ధాంతం కోసం పోరాడారు. కానీ ఆయన పేరుతో రాజకీయాలు చేసే వారు అధికారం కోసం ఐదుసార్లు పార్టీలు మారారు. ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జేపీ జీవితాంతం పోరాడారో అదే కాంగ్రెస్ ఒడిలో ఆయన (నితీశ్) కూర్చున్నారు. ఆయనకు అధికార దాహం ఉంది. అందుకే అధికారం కోసం జేపీ సిద్ధాంతాలను త్యాగం చేసి కాంగ్రెస్తో చేతులు కలిపారు’ అని విమర్శించారు.
కాగా, అమిత్ షా చేసిన ఈ విమర్శపై స్పందించాలని సీఎం నితీశ్ కుమార్ను మీడియా అడిగింది. దీంతో బుధవారం ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. ‘జయప్రకాష్ నారాయణ్తో మా అనుబంధం గురించి తెలియదా? ఆయన నాయకత్వంలో (జేపీ ఉద్యమంలో) పని చేశాం. ఆయనతో మాకు అనుబంధం ఏర్పడింది. వారు (అమిత్ షా, బీజేపీ) జేపీ గురించి మాకు చెబుతారా? వారికి ఏమైనా తెలుసా? జేపీతో వారికి సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
అలాగే జేపీ వారసత్వంపై వ్యాఖ్యానించేంత వయస్సు, అనుభవం అమిత్ షాకు లేదని నితీశ్ కుమార్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో మాత్రమే అమిత్ షా ఉనికిలోకి వచ్చారని తెలిపారు. అప్పుడు ఆయన హోదా ఏమిటి, అంతకు ముందు ఎక్కడ ఉన్నారు? దాని గురించి అమిత్ షా మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. ‘1974లో జరిగిన జేపీ ఉద్యమం గురించి అమిత్ షాకు ఏమి తెలుసు? ఆయన వయస్సు ఎంత?’ అంటూ నితీశ్ కుమార్ మండిపడ్డారు.