బెంగళూరు: తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు (double murder) స్థానికంగా కలకలం రేపాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల అనూష, 44 ఏళ్ల సురేష్ మధ్య ఐదేళ్లుగా పరిచయం ఉంది. అయితే తనను దూరం పెడుతున్న అనూషపై సురేష్ పగ పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం పార్కులో కలుసుకుందామని ఆమెకు ఫోన్ చేశాడు.
కాగా, ఒక వ్యక్తిని పార్కులో కలిసి ఐదు నిమిషాల్లో తిరిగి వస్తానని అనూష తన తల్లికి చెప్పింది. జయనగర్ ప్రాంతంలోని పార్కుకు ఆమె బయలుదేరింది. అనుమానించిన తల్లి కొంత సేపటి తర్వాత అనూషను అనుసరించింది.
మరోవైపు పార్కులో వేచి ఉన్న సురేష్ అక్కడకు వచ్చిన అనూషను కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పుడే పార్కుకు చేరుకున్న అనూష తల్లి ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయింది. పెద్ద రాయితో సురేష్ తలపై కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనూషను ఆసుపత్రికి తరలించగా ఆమె కూడా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జంట హత్యలపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.