సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్లోని నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనానికి గతంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్సింగ్ మాన్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు, వాటి వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాల నేపధ్యంలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే వ్యాపార సముదాయలలో తనిఖీలు చేపట్టినట్లు అధికారుల తెలిపారు.
ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఉన్న నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనాన్ని కూడా శుక్రవారం అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో అగ్నిమాపక శాఖ సూచించిన నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. భవనంలోని నాల్గో అంతస్తు పై భాగంలో అనుమతులు లేకుండా పూర్తిస్తాయి రెస్టారెంట్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గతంలో అగ్నిమాపక శాఖ జారీ చేసిన ఫైర్ ఎన్వోసీ ను రద్దు చేస్తున్నట్లు డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.