న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్పై నిఘా, నియంత్రణ చర్యలకు వెంటనే వార్రూమ్లను యాక్టివేట్ చేయాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. డెల్టాతో పోలిస్తే కనీసం 3 రెట్లు ఎక్కువగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించాలని, ప్రజలు గుమిగూడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రాత్రికర్ఫ్యూలు విధించాలని సూచించారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్సులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. టెస్టింగ్, వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలన్నారు.
పిల్లలకు ఇప్పుడే టీకా అవసరం లేదు!
12 ఏండ్ల లోపు పిల్లలకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని దేశంలో వ్యాక్సినేషన్పై ఏర్పాటు చేసిన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడు జయప్రకాశ్ ములియిల్ అభిప్రాయపడ్డారు. కాగా, పిల్లలకు టీకా, బూస్టర్ డోసుపై ఈ నెల చివర్లో కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ఎంపీ డానిష్ అలీకి కరోనా.. మొన్న పార్లమెంట్కు హాజరు
న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన సోమవారం పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అలీ కోరారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నారు.
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
ఒమిక్రాన్ కట్టడికి పలు రాష్ర్టాలు సమాయత్తం
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలతో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే ప్రమాదమున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాష్ర్టాలు ఆంక్షలను విధించాయి.
కర్ణాటక: డిసెంబర్ 30-జనవరి 2 వరకు ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దు. బహిరంగ ప్రాంతాల్లో గుమిగూడటం నిషేధం. క్లబ్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతోనే నడపాలి.
మహారాష్ట్ర: క్రిస్మస్, న్యూఇయర్ రోజున ముంబైలో పార్టీలు, గుమిగూడటం నిషిద్ధం. రూల్స్ ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక స్కాడ్ దళాలు.
ఢిల్లీ: డిసెంబర్ 31 వరకు బార్లు, రెస్టారెంట్లు 50% సామర్థ్యంతోనే పనిచేయాలి.