ముంబై : ఎల్గర్ పరిషత్-మావోయిస్టులతో లింకుకు సంబంధించిన కేసులో నిందితులపై ఎన్ఐఏ తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. నిందితులు దేశంపై యుద్ధానికి పూనుకున్నారని, సమాంతర ప్రభుత్వం నడపాలని కోరుకున్నారని ప్రత్యేక న్యాయస్ధానంలో దాఖలు చేసిన ముసాయిదా అభియోగపత్రంలో ఎన్ఐఏ ఆరోపించింది. ఈ కేసులో మానవ, పౌర హక్కుల కార్యకర్తలు సహా 15 మంది నిందితులపై ఎన్ఐఏ 17 అభియోగాలు నమోదు చేసింది.
నిందితులు నిషేధిత సీపీఐ(మావోయిస్టు)కు చెందిన వారని పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, వెమన్ గోన్సేల్వ్స్, హనీబాబు, ఆనంద్ తెల్దుంబ్డే, షోమ సేన్, గౌతం నవల్కా తదితరులున్నారు. కాగా, విప్లవం, సాయుధ పోరాటం ద్వారా రాజ్యం నుంచి అధికారాన్ని దక్కించుకుని జనతా సర్కార్ను ఏర్పాటు చేయడమనేది ముసాయిదా అభియోగాల ప్రకారం నిందితుల ప్రధాన ఉద్దేశమని ఎన్ఐఏ పేర్కొంది.