న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సిసోడియాపై తప్పుడు కేసు నమోదు చేశారని, మంత్రి సత్యేందర్ తర్వాత అరెస్టు కాబోయే మంత్రుల్లో సిసోడియా ఉన్నట్లు కేజ్రీ చెప్పారు. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియాను అరెస్టు చేసేందుకు కేంద్ర సర్కార్ పన్నాగం వేసినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. మా రాష్ట్ర మంత్రులందర్నీ అరెస్టు చేయాలంటూ ప్రధాని మోదీని వేడుకుంటున్నానని కేజ్రీవాల్ ఓ వీడియో సందేశంలో తెలిపారు. తనకు ఉన్న నమ్మకమైన సమాచారం మేరకు త్వరలోనే సిసోడియాను అరెస్టు చేస్తారని కేజ్రీ అన్నారు. మంత్రులపై కేసులు పెట్టాలని అన్ని దర్యాప్తు సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ సీఎం ఆరోపించారు.
అందర్నీ ఒకేసారి అరెస్టు చేయండి, అందర్నీ విచారించండి, దాడులు జరపండి అంటూ కేజ్రీ విమర్శించారు. సిసోడియా వల్ల విద్యారంగంలో సుమారు 18 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని, అలాంటప్పుడు సిసోడియా అవినీతిపరుడా, భారత్కు ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చారని, అలాంటి వ్యక్తిని ఇలా సత్కరిస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. సత్యేందర్ జైన్, సిసోడియాలను జైలుకు పంపడంలో ఉన్న రాజకీయ ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని కేజ్రీవాల్ అన్నారు.