సాయం.. చదివితే రెండు అక్షరాలే కావొచ్చు. కానీ అందిస్తే.. దాని విలువ జీవితాంతం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి బాసటగా నిలిచిన వారు దేవుళ్లుగా కనిపిస్తారు. సాయం చేసే తత్వం అతి కొద్ది మందికే సాధ్యం. ఎదుటి వ్యక్తుల బాధను తమ కష్టంగా భావించే గొప్ప మనసు కావాలి. ఉన్నదాంట్లో కొంత అందించి అండగా నిలిచే హృదయం ఉండాలి. అలాంటి కోవకే చెందిన కొంతమంది ఐటీ, ఫార్మా ఉద్యోగులు, సినీ పరిశ్రమ వ్యక్తులు కొత్త ఏడాది సంబురాలకు దూరంగా ఉండి ఆ సొమ్ముతో అభాగ్యులకు సాయం అందించి దాతృత్వం చాటుకున్నారు. రాత్రి నగరంలో పర్యటించి అనాథలకు కేకులు, నిరాశ్రయులకు దుప్పట్లు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఆడపిల్లల చదువుకు ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు.
ఫంక్షన్లు చేసి తమ స్టేటస్ను చూపించాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. అందుకోసం లక్షలు వెచ్చించి వేడుకలు నిర్వహిస్తారు. మధ్య తరగతి ప్రజలు సైతం అప్పుచేసి మరీ తాము తక్కువేం కాదనే పసందైన విందులు ఇచ్చి తమ దర్పాన్ని చూపిస్తారు. ఫలితంగా దుబారా ఖర్చు తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం నగరవాసుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. పార్టీలు.. ఫంక్షన్లకు అయ్యే ఖర్చులను అదుపు చేసే ధోరణి పెరుగుతోంది. కేవలం ఇతరులకు సహాయం చేయడమనే ఆలోచనతోనే వారి ఖర్చులను కట్టడి చేసుకోవడం విశేషం. బంజారాహిల్స్కు చెందిన వరుణ్రావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. స్టేటస్ చూపించుకునే కార్యక్రమాలను తగ్గించారు. ఒక్క రోజు వెలిగే లైట్లు.. ఆకర్శించే స్టేజీలు.. ధరించే దుస్తులకు ఎందుకు అంత ఖర్చు పెట్టాలి.. అనే ఆలోచన ఆయనలో మొదలై.. వైభవ వేడుకలు తగ్గించారు. ఆ సొమ్ముతో అనాథలకు సహాయం చేస్తున్నారు. అంతేకాదు నలుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తుండటం విశేషం. సికింద్రాబాద్కు చెందిన రవళి.. రోడ్ల పక్కన ఉండే నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటుంది. బంజారాహిల్స్కు చెందిన లక్ష్మి వీకెండ్లో తాను స్వయంగా వండిన వంటకాలతో అనాథశ్రమంలోని పిల్లలకు వడ్డిస్తుంది. ఇలా నగరంలో చాలా మంది తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.
దుప్పట్లు పంపిణీ చేశాను
ప్రతి ఏడాది ఘనంగా కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోవడం అలవాటు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునేవాళ్లం. కానీ ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నాను. రెండేండ్లు కరోనాతో దయనీయ పరిస్థితులు నెలకొనడంతో ఈ సారి వేడుకలు చేసుకునే వీలున్నా చేసుకోవడానికి మనసు అంగీకరించలేదు. వాటి పేరుతో కనీసం రూ.మూడు వేలయినా ఖర్చు అవుతుంది. ఆ సొమ్ముతో బ్లాంకెట్స్ కొనుగోలు చేశాను. చలితో వణుకుతూ ఇబ్బంది పడుతున్న నిరాశ్రుయులకు అందించాను. వారు ఆశీర్వదించారు. అంతకు మించి సంతోషపడ్డారు. నాకు చాలా బాగా అనిపించింది. మా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి.
పండ్లు, సరుకులు పంపిణీ చేశాం
ఈ సారి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోలేదు. స్నేహితులతో కలిసి అనాథాశ్రమాలకు వెళ్లి పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. రహ్మత్నగర్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలను ఎంపిక చేసుకున్నాం. అ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. నా స్నేహితులు కూడా నాతో సేవా కార్యక్రమాలకు కలిసొచ్చారు. ఏడాది చివరి రోజు అని పేరు చెప్పి లక్షల రూపాయలు ఖర్చుపెడుతాం. కానీ ఆ డబ్బుతో సరైన కార్యక్రమాలు చేపడితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ అలా ఆలోచించకపోయినా కొందరైనా సేవ చేయడానికి కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం.
పండ్లు పంపిణీ చేశాను
కొత్త ఏడాది సంబురాల నిరాశ్రయులతో జరుపుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులు భయానికంగా ఉన్నాయి. వాటి నుంచి అందరం బయటపడాలి. ఒకరికొకరం సాయం అందించుకునే వాతావరణం ఉండాలి. కష్టాల్లో ఉన్నవారికి స్పందించి సాయం అందించాలి. మేము రోడ్డుపై ఉన్న నిరాశ్రయులకు పండ్లు పంపిణీ చేశాం. వారి సాయం చేయడంతో కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను.
ఆడపిల్లల చదువుకు సాయం
నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. వారి చదువు కోసం నేను ఎప్పుడూ సాయం అందించడానికి సిద్ధంగా ఉంటాను. వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చదువుకునేలా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే రూ. 15 వేల వరకు ఖర్చు వస్తుంది. మా కుటుంబం ఈ సారి వేడుకులకు దూరంగా ఉన్నాం. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయలేదు. కొత్త ఏడాది సందర్భంగా కొంత మంది పిల్లల చదువుకు ఆర్థికంగా సాయం అందించాం. కరోనా పరిస్థితులతో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయారు. ఎదుటి వ్యక్తులు కష్టాల్లో ఉంటే మనం సంబురాలు చేసుకోవడం సబబు కాదనేది నా అభిప్రాయం.
నైటా ఆధ్వర్యంలో అన్నదానం
సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మలక్పేటలో నైటా ఆధ్వర్యంలో ఫిన్ బధిరుల ఆశ్రమంలో బంజారా మహిళా సంస్థ శనివారం అన్నదానం చేశారు. సంస్థ ప్రతినిధి డాక్టర్ ఆనందర్ కుమార్ మాట్లాడుతూ కొత్త సంవత్సర వేడుకలు బధిరులు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ను కట్ చేశారు.