హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. వారు చేసే పనులను ఉదయం, సాయంత్రం విడివిడిగా ఫొటోలు తీసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. తద్వారా ఉపాధి హామీ కూలీలంతా సాయంత్రం వరకు పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. రియల్ టైమ్ హాజరు కోసమే ఈ నిబంధన తీసుకొచ్చామని చెప్తున్న కేంద్రం.. ఎన్ఎంఎంఎస్ యాప్ను తెలంగాణలో వినియోగించాలని ఆదేశించింది.
ఈ నిబంధనలు కూలీలకు శరాఘాతంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ కింద ఎక్కువగా మట్టి పనులే ఉంటాయి. వేసవిలో ఎండ వేడికి సలసల కాలే గడ్డపారను కనీసం పట్టుకోగలిగే పరిస్థితి కూడా ఉండదు. ఈ నేపథ్యంలో కూలీలు ఉదయం 6 గంటలకే పనుల్లోకి దిగి.. ఎండ తీవ్రమవగానే ఇంటికి వెళ్తారు. కానీ, కూలీలు సాయంత్రం వరకు పనిచేయాలని కేంద్రం ఆదేశించడం, హాజరు పేరిట కొత్త నిబంధనలు విధించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం ఇవ్వడంలేదు.
వారు చేసిన పనిని లెక్కించి అంత మేరకే కూలి చెల్లిస్తుండటంతో ఎక్కువ డబ్బు కావాలనుకొన్న కూలీలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావడం, రోజూ విధిగా సాయంత్రం వరకు పనిచేయాల్సిదేనని ఆదేశాలివ్వడంపై కూలీలు మండిపడుతున్నారు. ఈ నిబంధనల వల్ల కూలీలు క్రమంగా ఉపాధి హామీ పనులకు దూరమవుతారని, ఫలితంగా మళ్లీ వలసలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.