‘జాతిపిత’ జీవిత నేపథ్యంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. ఆయన ఒక మహాసముద్రం. బాపూజీ జీవితాన్ని తరచి చూసినప్పుడల్లా కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. ‘గాంధీ అభిమానులు తనను మెచ్చుకోవడం సహజమే. కానీ, ప్రత్యర్థులు కూడా ఆయన గొప్పతనాన్ని అంగీకరించారు’ అంటూ మార్షల్ స్మట్స్ తదితరులను ఉటంకించారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తన వ్యాసంలో. ‘గాంధీ క్విట్ ఇండియా పిలుపునే మహాకవిత్వంగా పరిగణిస్తాను’ అన్నారు దాశరథి. ఇలాంటి మహానుభావుల వ్యాసాలతోపాటు పుచ్చలపల్లి సుందరయ్య, రాహుల్ సాంకృత్యాయన్, అడవి బాపిరాజు వంటి మేధావులు బాపూజీపై వెలిబుచ్చిన అభిప్రాయాలను మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన ’గాంధీయే మార్గం’లో 28 ఉత్తమ వ్యాసాలు ఉన్నాయి.
ఇవన్నీ బాపూజీలో కొత్త కోణాల్ని, కొత్త ఆలోచనల్ని మనకు విశదపరుస్తాయి. విభ్రాంతికి లోను చేస్తాయి. కేవలం దేశ స్వాతంత్య్ర ప్రదాతగానే కాకుండా వ్యక్తిగత విషయాలను, ఆయన నేర్పిన వ్యక్తిత్వ పాఠాలను కళ్లముందు నిలుపుతాయి. బాపూజీ దీక్షా దక్షతలకు ఆంగ్లేయులే నివ్వెరబోయిన సంఘటనలు కోకొల్లలు. ఆయన రాజకీయ వ్యూహాలు, చేపట్టిన శాంతియుత ఆందోళనలు ప్రభుత్వానికి మింగలేని కక్కలేని పరిస్థితి కలిపిస్తే- మరోపక్క సామాన్యులు సంఘటితం కావడానికి ఎంతో దోహదపడ్డాయి. శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే ఆయన ఎవరి పనులు వారే చేసుకోవాలని చెప్పేవారు. రోగులకు సేవలందించడం తనకు ప్రీతిపాత్రమైన పని. దానికోసం ప్రాణాలను పణం పెట్టి మరీ ముందుకు నడిచేవారు. ‘నూటా పాతికేళ్ళు బతుకుతాను’ అని చెప్పిన మహానుభావుడు స్వాతంత్య్రం అనంతరం దేశ విభజనతో మానసికంగా కుంగిపోయారు. అప్పటి హింసాకాండ మరింత కుంగదీసింది. ఇకపై తనకు సుదీర్ఘ జీవితేచ్ఛ లేదని ఆత్మీయుల దగ్గర పదేపదే బాధపడ్డారు. బాపూజీ గురించి ఈ పుస్తకం మనకు ఎంతో ‘ఎరుక’ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. సమకాలీన సమస్యలకు కూడా ఇందులో ఎన్నో పరిష్కారాలు దొరుకుతాయి. కాకపోతే వాటిని వెదికే ఆసక్తి ఉండాలంతే!
గాంధీయే మార్గం
సంపాదకులు: డా. నాగసూరి వేణుగోపాల్
పేజీలు: 193, వెల : రూ. 250/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, విజ్ఞాన ప్రచురణలు. రచయిత : 9440732392
ఆలోచనాత్మక కవిత్వం
వేకువకు మాటను, వెలుతురుకు బాటను ఇచ్చే కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు. వివిధ అంశాలపై 47 కవితలతో ఆయన వెలుగులోకి తెచ్చిన సంకలనం ‘పచ్చికడుపు వాసన’. ‘ఇక్కడ అడుగు పెట్టేవరకు తెలియదు/ ఇలాంటి భాష కూడ ఒకటుంటుందని’ అంటూ అడవి భాష సుగంధాల్ని అమ్మ కడుపు పచ్చివాసనతో పోలుస్తూ రాసిన ‘పచ్చికడుపు వాసన’ కవితతో ప్రారంభమవుతుందీ పుస్తకం. తండ్రి లేని పిల్లల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పిల్లలు మానసిక వికలాంగులైతే అది మరీ దుర్భరం. అలాంటిది తన సహోద్యోగి మానసిక వికలాంగులైన తన పిల్లల నుంచి శాశ్వతంగా దూరమైన సందర్భాన్ని చూసి చలించి… ‘తన పిల్లల్లాంటి పిల్లలే/ ఏ లోకం నిండా ఉన్నారో ఏమో’ అనుకొని వేరే లోకాలకు వెళ్లిపోయారని చిత్రించిన ‘నాన్న లేని- వాళ్లు’ కవిత ఆర్ద్రంగా సాగుతుంది.
ఇక తమ ప్రాంతమే తమకు బందిఖానా అయినట్లుగా కాశ్మీరు వాసులు చెప్పుకొంటున్నట్లుగా అక్షరీకరించిన ‘నేను… కశ్మీరీని…’, వినాశనం దిశగా కొనసాగుతున్న ఆధునిక మానవుణ్ని… ‘కాలం గర్భగుడి ముందు దిగుడుమెట్టువే!/ శార్వరి ఒడిలో తల నరుక్కునే సూరీడువే!’ అని హెచ్చరిస్తూ సాగే ‘తల నరుక్కున్న సూరీడు’, రాత్రివేళ కొండల అందాల్ని వర్ణించే ‘పహాడీరాగం’, పాపికొండల నేపథ్యంతో సాగే ‘పాపికొండలూ… పాపిడిసేరూ…’, మానవ విధ్వంసాన్ని భరించలేని భూమాత, మనిషికి దూరంగా వెళ్లడానికి ‘నాకూ సెలవు కావాలి’ అని అడుగుతున్నట్లుగా సాగే ‘పచ్చికడుపు వాసన’లోని కవితలు భావుకతతో, ఆలోచనాత్మకంగా సాగిపోతాయి. ‘తడి ఆరని స్వరం’ రాఘవేంద్ర రావు కవిత్వాన్ని విశ్లేషిస్తూ సాగిన పుస్తకం. కవి అంతరంగాన్ని సౌభాగ్య అక్షరాల అద్దంలో చూపించారు.
పచ్చికడుపు వాసన
పేజీలు: 166; వెల: రూ. 125
రచన: యార్లగడ్డ రాఘవేంద్రరావు
తడి ఆరని స్వరం
పేజీలు: 80; వెల: రూ. 80
రచన: సౌభాగ్య
ప్రచురణ: శ్రావ్య పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
బుక్ షెల్ఫ్
లచ్చుంబాయి (కథలు)
రచయిత: డా. రూప్ కుమార్ డబ్బీకార్
పేజీలు: 111, వెల: రూ. 100
ప్రతులకు: రచయిత, ఫోన్ 99088 40186.
పాలపిట్ట బుక్స్, ఫోన్: 98487 87284
వేళ్ళని వెదికే చెట్లు (కవితా సంపుటి)
రచయిత్రి: డా॥ సి. భవానీదేవి ,
పేజీలు: 138, వెల: రూ. 150, ప్రతులకు: రచయిత్రి,
ఫోన్: 040 27636172, అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు